U19 World Cup 2024: వచ్చే ఏడాది శ్రీలంక వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహణ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్లను శ్రీలంకలో కాకుండా సౌతాఫ్రికాలో నిర్వహిస్తామని మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
'శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం కారణంగా అండర్ 19 ప్రపంచకప్ ఆతిథ్య వేదికను శ్రీలంక నుంచి సౌతాఫ్రికాకు మార్చడం జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు మెంబర్స్ దీనికి ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని టోర్నీలో పాల్గొంటున్న జట్లకు తెలియజేశాం. గత ఎడిషన్కు కూడా సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇచ్చింది. తాజా నిర్ణయం వల్ల శ్రీలంక దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్పై ఎలాంటి ప్రభావం ఉండదు.'అని ఐసీసీ బోర్డు మెంబర్ తెలిపారు.

గత నెలలోనే ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీలంక వేదికగా మ్యాచ్లు జరుగుతాయని ప్రకటించింది. తాజాగా ఆతిథ్య వేదికను సౌతాఫ్రికాకు మార్చింది. కొద్దిరోజుల క్రితం తమపై నిషేధం ఎత్తి వేయాలని ఐసీసీని శ్రీలంక క్రికెట్ బోర్డు కోరింది.
ఇక వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఘోర వైఫల్యం అనంతరం ఆ దేశ ప్రభుత్వం క్రికెట్ బోర్డును రద్దు చేసింది. దీనిపై ఎస్ఎల్సీ కోర్టును ఆశ్రయించగా.. స్టే విధించింది. ఈ రాజకీయ పరిణామాలను తప్పుబట్టిన ఐసీసీ.. శ్రీలంక బోర్డుపై నిషేధం విధించింది.