హైదరాబాద్: వన్డే ప్రపంచకప్నకు సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో విదేశీ యాత్రలు ముగించుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ బుధవారం హైదరాబాద్ చేరుకుంది.
రామోజీ ఫిల్మ్సిటీలో ఈ కప్పును ప్రదర్శించగా నగర వాసులు భారీ సంఖ్యలో హాజరై ట్రోఫీని చూసి ఆనందించారు. ఇక గురువారం నగరంలోని చార్మినార్, ఉప్పల్ క్రికెట్ మైదానంలో ప్రపంచకప్ను ప్రదర్శించనున్నారు.

ప్రపంచకప్ విజేతలకు అందించే ఈ ట్రోఫీకి ఘన చరిత్ర ఉంది. 1999 ప్రపంచకప్ నుంచి ఇప్పుడున్న ట్రోఫినే విజేతలకు అందజేస్తున్నారు. ఛాంపియన్ జట్టుకు మొదట ఈ ట్రోఫీని ప్రదానం చేసి.. అనంతరం దీని నమూనాను ఇస్తున్నారు. నిజమైన ట్రోఫీ కింది భాగంలో విజేత జట్ల పేర్లను రాస్తున్నారు.
ప్రస్తుత ట్రోఫీని లండన్లోని గరార్డ్ అండ్ కో అనే ఆభరణాల సంస్థ తయారుచేసింది. దీని తయారీలో బంగారం, వెండి ఉపయోగించారు. ఇది 60 సెంటీమీటర్ల ఎత్తుతో పాటు 11 కిలోల బరువు ఉంటుంది. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత. మూడు వైపులా పొడుగ్గా ఉండే వెండి స్టంప్స్, బెయిల్స్ మీద బంగారు గ్లోబ్ రూపంలో బంతి పొదిగి ఉన్నట్లు ఉంటుంది. క్రికెట్లోని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లను ఈ మూడు స్టంప్స్ ప్రతిబింబిస్తాయి.
ఇక 1999 ప్రపంచకప్ ముందు నాలుగు రకాల ట్రోఫీలను మార్చారు. ఇంగ్లండ్లో జరిగిన తొలి మూడు (1975, 1979, 1983) ప్రపంచకప్ల్లోనూ ఒకే రకమైన ట్రోఫీని అందజేశారు. స్పాన్సర్షిప్ కారణంగా ప్రుడెన్షియల్ కప్గా వ్యవహరించిన ఇది చూడ్డానికి వింబుల్డన్ పురుషుల ట్రోఫీలాగా ఉండేది.
తొలిసారి ఇంగ్లండ్ బయట 1987లో ప్రపంచకప్ నిర్వహించారు.
ఈ రిలయన్స్ ప్రపంచకప్కు భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చాయి. అప్పుడు డైమండ్లు పొదిగి, బంగారు పూతతో ఉన్న కప్పును విజేత ఆస్ట్రేలియాకు అందజేశారు. అప్పుడే దీని విలువ దాదాపు రూ.6 లక్షలు. 1992 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచకప్ కోసం అందించిన ట్రోఫీ ఈ కప్పు చరిత్రలోనే అందమైందిగా పేరు తెచ్చుకుంది.
వాటర్ఫోర్ట్ క్రిస్టల్ ట్రోఫీని విజేత పాకిస్థాన్ సొంతం చేసుకుంది. ఇక 1996లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక కలిసి ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ కోసం మరోసారి లోహంతో కూడిన కప్పునే తయారు చేశారు. ఇది ఎక్కువగా అలంకరించిన కప్పుగా చరిత్రకెక్కింది.