
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ఆతిథ్య విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మధ్య నెలకొన్న వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పరిష్కరించింది. శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మెగా టోర్నీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
2021 టీ20 ప్రపంచకప్ భారత్లో జరగుతుందని చెప్పిన ఐసీసీ.. 2022 టీ20 వరల్డ్కప్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపింది. ఇక వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2022లో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 మధ్య ఈ మహిళల మెగా ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేసింది.
ఈ వర్చువల్ మీటింగ్లో 2021, 2022 టీ20 ప్రపంచకప్ల ఆతిథ్యంపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా, సీఏ తరఫున ఎర్ల్ ఎడ్డింగ్స్, నిక్ హక్లీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. తమ దేశంలో జరగాల్సిన 2020 టోర్నీ ఏడాది పాటు వాయిదా పడింది కాబట్టి వచ్చే ఏడాది అవకాశం తమకే ఇవ్వాలని ఆస్ట్రేలియా కోరగా... పాత షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 ప్రపంచకప్ అవకాశం తమకే ఇచ్చి 2022 కోసం ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాలని భారత్ వాదించింది.
2023లో భారత్లో వన్డే వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉన్నందున సంవత్సరం వ్యవధిలో రెండు మెగా ఈవెంట్ల నిర్వహణ సమస్యలతో బీసీసీఐ తమ వాదనను ఐసీసీ ముందు గట్టిగా వినిపించింది. వరుసగా రెండేళ్లు రెండు పెద్ద టోర్నీల ఆతిథ్యం ఏమాత్రం బాగుండదని, ప్రేక్షకుల ఆసక్తి తగ్గడమే కాకుండా... బోర్డు నిర్వహణా శక్తికి కత్తిమీద సాములాంటిదేనని చెప్పింది. ఇక బీసీసీఐ వాదనకు తలొగ్గిన ఐసీసీ.. సీఏని ఒప్పించింది.
ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ విండోలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగనుంది.