ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ నిర్వహణ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ నిర్వహణ విషయమై ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశమైన విషయం తెలిసిందే. వర్చువల్గా జరిగిన ఈ మీటింగ్లో ఐసీసీ.. పాకిస్థాన్కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
హైబ్రిడ్ మోడల్ పద్దతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. తుది నిర్ణయం వెల్లడించడానికి ఒక రోజు సమయం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. శనివారం జరిగే మరో సమావేశంలో టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం వెల్లడించాలని పీసీబీని ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ టోర్నీని భాయ్కాట్ చేస్తామని పీసీబీ చెబితే.. మరో దేశం వేదికగా టోర్నీ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

'హైబ్రిడ్ మోడల్ పద్దతిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ ఒక రోజు సమయం ఇచ్చింది. ఒకవేళ ఈ పద్దతిలో టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకోకున్నా.. టోర్నీని భాయ్కట్ చేసినా.. మరో దేశంలో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించేందుకే పీసీబీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.'అని ఆజతక్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా ట్వీట్ చేశాడు.
షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరిస్తోంది. భద్రతా సమస్యలను కారణంగా చూపుతోంది. తమ మ్యాచ్ల తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ.. ఇప్పటికే ఐసీసీకి సూచించింది. దాంతోనే ఐసీసీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని పీసీబీకి సూచిస్తోంది. మరోవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్లో పర్యటించే విషయంపై ఇప్పటికే బీసీసీఐ తమ ప్రకటనను విడుదల చేసింది. అక్కడ భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే భారత జట్టును పంపించలేమని పేర్కొంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి, టీమిండియా పాకిస్థాన్కు వెళ్లే అవకాశం లేదు.'అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.