
పిచ్ మరీ నాసిరకం..
ఇండోర్ పిచ్ అండ్ ఔట్ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ అభిప్రాయాలను తీసుకొని మరీ ఐసీసీకి నివేదిక అందజేశాడు. 'పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాట్, బంతి మధ్య ఎలాంటి సమన్వయం లేదు. స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పినా.. అలాంటిది కనిపించలేదు.
పేసర్లకు ఏమాత్రం అనుకూలించలేదు. పిచ్ను క్యురేటర్ మరీ నాసిరకంగా తయారు చేశాడు'అని క్రిస్ బ్రాడ్ తన నివేదికలో పేర్కొన్నాడు.

మూడు డీమెరిట్ పాయింట్స్..
ఈ నివేదిక ఆధారంగా ఐసీసీ చర్యలు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఇండోర్ పిచ్కు మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏడాదిలో ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే స్టేడియంపై నిషేధం పడుతుంది. కానీ ఇండోర్లోని హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించడంతో నిషేధం తప్పించుకుంది. ఈ ఏడాదిలో మరో రెండు పాయింట్లు వస్తే ఐదేళ్ల పాటు నిషేధానికి గురి కానుంది.

ఆసీస్ ఘన విజయం..
76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 18.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) సిల్వర్ డక్గా వెనుదిరిగినా.. ట్రావిస్ హెడ్(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 6 ఫోర్లతో 28) అటాకింగ్ గేమ్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

చెత్త బ్యాటింగ్తో..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులు చేసి 88 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమైన భారత్ 163 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లతో భారత్ను దెబ్బతీస్తే.. రెండో ఇన్నింగ్స్లో నాథన్ లయర్ 8 వికెట్లతో పతనాన్ని శాసించాడు.


Click it and Unblock the Notifications












