వచ్చే ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. మొత్తం 20 జట్ల మధ్య 40 లీగ్ మ్యాచ్లతో పాటు సూపర్-8, నాకౌట్ మ్యాచ్ల వివరాలను ఐసీసీ మంగళవారం వెల్లడించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తోంది. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఒకవేళ ఆ జట్టు నాకౌట్ చేరితే ఆ మ్యాచ్లు కూడా అక్కడే జరుగుతాయి.
ఈ టోర్నీకి ఇటలీ తొలిసారి అర్హత సాధించగా మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్తో పాటు నమీబియా, యూఎస్ఏ, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 చేరిన జట్లను రెండు గ్రూప్స్గా విభజిస్తారు. సూపర్ 8లో ప్రతీ గ్రూప్లోని టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి.

ప్రపంచకప్ మ్యాచ్లకు భారత్లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా చెన్నై, ముంబై మైదానాలు ఆతిథ్యం ఇవ్వనుండగా.. శ్రీలంకలో పల్లెకెలె, కొలంబో స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరోసారి మొండిచ్చే ఎదురైంది. పాకిస్థాన్, నాకౌట్తో పాటు ఫైనల్ చేరకపోతే ముంబై, కోల్కతాలో సెమీఫైనల్స్, అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఫిబ్రవరి 7న ముంబై వేదికగా యూఎస్ఏతో జరిగే మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. ఐసీసీ షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లు పాల్గొన్నారు. కెప్టెన్గా గత టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మను టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.