
దుబాయ్: రానున్న ఎనిమిదేండ్ల(2024-31)లో ప్రపంచకప్ టోర్నీల వేదికలను గతవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2026లో శ్రీలంకతో కలిసి భారత్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి వేదికవుతుండగా, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో భారత్, బంగ్లాదేశ్లో వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఎనిమిదేండ్ల వ్యవధిలో బీసీసీఐకి మూడు ప్రపంచ టోర్నీలను నిర్వహించే అవకాశం లభించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ 2025లో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్నది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి తర్వాత అంతర్జాతీయ సిరీస్లకు పాక్ దూరమైంది.
అయితే చాలాకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగట్లేదు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్లో భారత్ పర్యటించడానికి విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్లలో పాక్లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా అక్కడకు వెళ్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. ఇదే విషయమై స్పందించిన ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే.. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడం అతి పెద్ద సవాలుతో కూడుకున్నదని తెలిపాడు.
'పాకిస్థాన్లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడమనేది సవాలుతో కూడుకున్న విషయం. భౌగోళిక, రాజకీయ విషయాలను నేను అదుపు చేయలేను. కానీ రెండు దేశాల మధ్య సత్సంబంధాల్ని పెంపొందించడానికి క్రికెట్ దోహదపడుతుందని భావిస్తున్నా. ప్రజలు, దేశాలు ఒకేతాటిపై నిలవడానికి క్రీడలు చేసే అత్యంత గొప్ప సాయమిది. అదే జరిగితే అద్భుతమే.'అని గ్రేగ్ బార్క్లే అన్నాడు. ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ తలపడగా... ఈ మ్యాచ్లో కోహ్లీసేనను 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే నిర్ణయం తమ చేతుల్లో లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇటీవల తెలిపాడు. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా కూడా ఈ విషయంలో ఏం చేయలేరన్నాడు. భారత్ - పాక్ సిరీస్ పై నిర్ణయం తీసుకోవాల్సింది.. రెండు దేశాల ప్రభుత్వాలేనని చెప్పాడు. రెండు దేశాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ సాధ్యపడుతుందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ స్తంభించిపోయి ఎన్నో సంవత్సరాలైందని, దాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు నిర్యం తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు.