
రూల్స్ మార్చిన ఐసీసీ
కరోనా కారణంగా కొన్ని సిరీస్లు జరగని నేపథ్యంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ సూచనల ప్రకారం.. పాయింట్ల విధానాన్ని ఐసీసీ మార్చింది. 'కరోనా కారణంగా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో సగం కన్నా తక్కువ మ్యాచ్లు జరిగాయి. ముగింపు తేదీ నాటికి 85 శాతం మ్యాచ్లే పూర్తవుతాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం జట్ల స్థానాలను నిర్ణయించడం కోసం పాయింట్లను పరిగణనలోకి తీసుకునేవారు. ఇప్పుడు సంపాదించిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకులు కేటాయిస్తారు. ఐసీసీ క్రికెట్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలు రెండూ ఈ కొత్త విధానానికి మద్దతుపలికాయి. పూర్తి మ్యాచ్లు ఆడలేకపోయిన జట్లకు నష్టం జరగదు' అని ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నే చెప్పాడు.

ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది
2019 ఆగస్టు నుంచి టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం అయింది. ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్లను భారత్ ఆడింది. కోహ్లీసేన 9 మ్యాచ్లు ఆడి.. ఏడింట్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. మొత్తంగా 480 పాయింట్లకి భారత్ 360 పాయింట్లు సాధించింది. అంటే 75 శాతం పాయింట్లు దక్కించుకుంది. ఆస్ట్రేలియా మూడు సిరీస్ల రూపంలో మొత్తం 10 మ్యాచ్లు ఆడగా.. ఏడింట్లో గెలుపొంది, రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ని డ్రాగా ముగించింది. మొత్తంగా 360 పాయింట్లకిగానూ 296 పాయింట్లు సాధించింది. అంటే దాదాపు 82 శాతం పాయింట్లని దక్కించుకుంది. దాంతో ఆస్ట్రేలియా నెం.1 స్థానానికి ఎగబాకింది. భారత్ నెం.1 ర్యాంక్ చేజారింది.
అలాంటి మ్యాచ్లను పరిగణనలోకి తీసుకోరు
తాజా ప్రతిపాదనల వల్ల భారత్ రెండవ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 82.22 శాతం పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ (75) రెండవ స్థానంలో, ఇంగ్లండ్ (60.83) మూడవ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ 50 పాయింట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఇంతకుముందు నిబంధన ప్రకారం.. ఏదైనా కారణం వల్ల మ్యాచ్ జరగకపోతే ఆ మ్యాచ్ను డ్రాగా పరిగణించి రెండు జట్లకు సమానంగా పాయింట్లు పంచేవాళ్లు. కరోనా నేపథ్యంలో ఈ నిబంధన వల్ల కొన్ని జట్లకు లబ్ధి చేకూరుతుందని భావించిన ఐసీసీ.. అలాంటి మ్యాచ్లను పాయింట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించింది.

జూన్లో ఫైనల్:
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ టోర్నీ ప్రారంభించారు. 27 సిరీస్లతో మొత్తం 71 మ్యాచ్లు నిర్వహించాలని భావించారు. రెండేళ్లలో చాంపియన్షిప్ను పూర్తి చేయనున్నారు. అయితే కరోనా వల్ల ఆరు టెస్ట్ సిరీస్లను రద్దు చేశారు. దాంట్లో బంగ్లా మ్యాచ్లే నాలుగు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య వచ్చే ఏడాది జూన్లో ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కోహ్లీ వెళ్లిపోతే.. భారత జట్టుపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది: పాంటింగ్


Click it and Unblock the Notifications












