
సిడ్నీ: తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ వెళ్లిపోతే బ్యాటింగ్ ఆర్డర్పై భారత జట్టుకు స్పష్టత లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. కోహ్లీ నిష్క్రమణతో టీమిండియాపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుందన్నాడు. జట్టు ఎంపిక పరంగా ఆసీస్ కన్నా కోహ్లీ సేనకు తలనొప్పులు ఎక్కువున్నాయని పాంటింగ్ తెలిపాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో.. టీమిండియా కెప్టెన్ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్కు తిరిగొస్తాడు.
తాజాగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ వెళ్లిపోతే టీమిండియా ఇబ్బంది పడుతుంది. అతడి బ్యాటింగ్, నాయకత్వం లేకపోవడం ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. అజింక్య రహానె సారథ్య బాధ్యతలు తీసుకుంటాడు. కానీ అది అతడిపైనా అదనపు ఒత్తిడినే పెంచుతుంది. కీలకమైన నాలుగో స్థానంలో ఆడే కొత్త బ్యాట్స్మన్ను వారు గుర్తించాలి. తొలి టెస్టు బ్యాటింగ్ ఆర్డర్ పైనే వారికింకా స్పష్టత లేదనుకుంటున్నా. ఎవరు ఓపెనింగ్ చేయాలి?, కోహ్లీ వెళ్తే నాలుగో స్థానంలో ఎవరు? వంటివి ఇంకా తెలియదు' అని అన్నాడు.
'భారత్ జవాబులు వెతకాల్సిన ప్రశ్నలు ఎక్కువే ఉన్నాయి. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్లో ఎవరిని ఆడిస్తారు?.. యువ పేసర్లు నవదీప్ సైని, మొహమ్మద్ సిరాజ్ వీరిలో ఎవరిని తీసుకుంటారు?.. జట్టులో స్పిన్నర్లూ బాగానే ఉన్నారు. మరి వారిలో ఎవరిని ఎంచుకుంటారు?.. అడిలైడ్లో గులాబి టెస్టుకు ఎవరిని తీసుకుంటారో తేల్చుకోవాల్సి ఉంది' అని రికీ పాంటింగ్ అన్నాడు. గత సిరీసులో కోహ్లీసేన అద్భుతంగా ఆడిందన్నది వాస్తవమేనని అయితే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేకపోవడంతో రెండు జట్ల మధ్య అంతరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు.
నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన నేపథ్యంలో మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక తొడ కండరాల గాయంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యాడు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు మాత్రం ఎంపికయ్యాడు. త్వరలో రోహిత్ సిడ్నీ చేరుకోనున్నాడు.