భారత్తో వన్డే, టీ20 సిరీస్లను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రహం వ్యక్తం చేశాడు. ఓడిన ప్రతీసారి సాకులు చెప్పడం ఆపేయాలని హితవు పలికాడు. ఈ వరుస పరాజయాలు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్తో పాటు మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్.. భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.
టీ20 సిరీస్ను 1-4తో కోల్పోయిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్లో 0-3తో క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే ఈ పరాజయాన్ని తాము పట్టించుకోమని, ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. బెన్ డకెట్ కామెంట్స్ హాస్యాస్పదంగా అనిపించాయన్నాడు.

'బెన్ డకెట్ వ్యాఖ్యలు నవ్వును తెప్పించాయి. గతంలోనూ అతను ఇలాంటి జోక్స్ చేశాడు. ఇంగ్లండ్ను చూసే యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటం నేర్చుకున్నాడని తెలిపాడు. కానీ తాజా పరాజయంపై అతను మాట్లాడిన మాటలు జోక్గా కాకుండా సాకుగా అనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్తో వన్డే సిరీస్ ఓటమి తప్పకుండా ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.
పరాజయాలు ఎదురైన ప్రతీసారి ఇంగ్లండ్కు సాకులు చెప్పడం అలవాటుగా మారింది.
2023 వన్డే ప్రపంచకప్లోనూ ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఇప్పుడు కూడా ఆటగాళ్లు ఫామ్లో లేరు. జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నా.. వారు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. టెస్ట్ క్రికెట్లోనూ ఆ జట్టు పరిస్థితి ఇలానే ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ విధానం తనకు అర్థం కావడంలేదని బెన్ స్టోక్స్ విమర్శలు చేశాడు. ఓడిపోయిన ప్రతీసారి నిందలు వేయడం, సాకులు చెప్పడం సమంజసం కాదు. ఓటములను విశ్లేషించి తమ తప్పులను సరిదిద్దుకోవాలి. కానీ వారు అలా చేయడం లేదు. ఓటములను చాలా లైట్ తీస్కుంటున్నారు. ఇది విచారకరం'అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పుకొచ్చాడు.