ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఐసీసీ కంటే ముందు ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ను ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ వెల్లడించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ దాయాదుల సమరం ఫిబ్రవరి 23న జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుందని ఐసీసీ గురువారం ప్రకటించింది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని వెల్లడించింది. అదే విధంగా 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడుతుందని పేర్కొంది. అతి త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపింది.

అయితే ఐసీసీ కంటే ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ 15 మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ను వెల్లడించింది. భారత మ్యాచ్లకు సంబంధించిన తటస్థ వేదిక ఏంటో మాత్రం వెల్లడించలేదు. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది.
భారత తమ క్యాంపైన్ను బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న ప్రారంభించనుంది. లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్లను ఆడనుంది. న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ను మార్చి 2న ఆడనుంది. మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..
ఫిబ్రవరి 20, 2025: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్(మధ్యాహ్నం 2 గంటలకు)
ఫిబ్రవరి 23, 2025: భారత్ వర్సెస్ పాకిస్థాన్(మధ్యాహ్నం 2 గంటలకు)
మార్చి 2, 2025: భారత్ వర్సెస్ న్యూజిలాండ్(మధ్యాహ్నం 2 గంటలకు)