అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఛైర్మన్ జై షాకు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్(డబ్ల్యూసీసీ) సలహా మండలిలో జై షాకు చోటు కల్పించారు. క్రికెట్లో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది.
ఈ బోర్డులో ప్రస్తుత కెప్టెన్లు, మాజీ క్రికెటర్లు, అధికారిక బ్రాడ్కాస్టర్స్ ప్రతినిధులు సహా పలువురికి చోటిచ్చారు. భారత్ నుంచి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాలకు చోటు దక్కింది.

వీరితో పాటు కుమార సంగక్కర, క్రిస్ డెహ్రింగ్, మెల్ జోన్స్, హీథర్ నైట్, ట్రుడీ లిండ్బ్లేడ్, హీత్ మిల్స్, ఇంతియాజ్ పటేల్, గ్రేమ్ స్మిత్, ఆండ్రూ స్ట్రాస్ డబ్ల్యూసీసీలో సభ్యులుగా ఉన్నారు. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ స్థానంలో ఈ డబ్ల్యూసీసీని తీసుకొచ్చారు.గతంలో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ చేసిన పనులు ఇక నుంచి డబ్ల్యూసీసీ ద్వారా చేయనున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఛైర్మన్గా పని చేసిన జై షా ఇటీవలే ఐసీసీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గత డిసెంబర్లో ఆయన ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆయన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
దాదాపు 128 ఏండ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్(లాస్ఎంజిల్స్ 2028)లో క్రికెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగిందని ఐసీసీ ప్రకటించింది. ఈనెల 30న లాసానేలో జరిగే కీలకమైన ఐవోసీ సెషన్కు ముందు పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగిందని ఐసీసీ పేర్కొంది.