అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఐసీసీ కెప్టెన్స్ డే ఘనంగా జరిగింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి 10 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతర మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచకప్ సన్నాహకాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అయితే ఈ కెప్టెన్స్ డేలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్లంతా ఓ వైపు మీడియాతో మాట్లాడుతుండగా.. మరోవైపు బవుమా ఓ కునుకు తీసాడు. అందరూ చిట్ చాట్ చేస్తుండగానే కళ్లు మూసుకొని నిద్రపోయాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాపం బవుమాకు నిద్ర సరిపోలేదనుకుంటా.. అతన్ని త్వరగా ఇంటికి పంపించండని సెటైర్లు పేల్చుతున్నారు. బవుమా ఇలా నిద్రపోతే ప్రపంచకప్ గెలవడం ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
సంప్రదాయం ప్రకారం మెగా టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు ఐసీసీ కెప్టెన్స్ డే నిర్వహిస్తారు. అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఆరంభ వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్య కారణాలతో బీసీసీఐ ఆరంభ వేడుకలను రద్దు చేసింది. బాలీవుడ్ తారలు రణ్వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లే వంటి సినీ తారలతో వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ ముందుగా నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.
ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. ఈ వేడుకలను పూర్తిగా రద్దు చేయకుండా టోర్నీ మధ్యలో లేదా చివర్లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ సెర్మనీకి బదులుగా.. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రోజుగానీ.. లేదంటే మెగా టోర్నీకి ముగిశాక గానీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ప్రపంచకప్ మొదలవ్వనుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.