దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్సాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ చర్యలు తీసుకుంది. తనను కలిసిన భారత బుకీ వివరాలు వెల్లడించకుండా నువాన్ జోయ్సా తప్పు చేశాడని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్ధారించింది. ఏడాదిన్నర కాలం నుంచి అతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాత్కాలిక నిషేధం అమలైన 2018 అక్టోబర్ 31 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది.
ఆర్టికల్ 2.1.1 నిబందన ప్రకారం.. ఎవరైనా ఫిక్సింగ్ చేయడానికి యత్నించడం, ఇతరులను ఫిక్సింగ్ చేసేందుకు ప్రోత్సహించడం, మ్యాచ్ ఫలితాలు మార్చేందుకు యత్నించడం... ఆర్టికల్ 2.1.4 ప్రకారం, ఇతరులకు సూచనలు చేయడం, తప్పిదాలు చేసేందుకు ప్రోత్సహించడం, నేరుగా ఫిక్సింగ్కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాలు మార్చివేసేందుకు యత్నించడం లాంటి యత్నాలు ఆర్టికల్ 2.1 కిందకి వస్తాయి.
42 ఏళ్ల నువాన్.. లంక తరఫున 30 టెస్టులతో పాటు 95 వన్డేలలో ఆడాడు. 2017లో యూఏఈ వేదికగా జరిగిన టీ10 టోర్నీలో లంక బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2018లో అతనిపై అభియోగాలు వచ్చాయి. కాగా జోయ్సా ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్కు ప్రాతినిధ్యం వహించాడు.