బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ నాసిర్ హొస్సెన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. ఐసీసీ యాంటీ కరప్షన్ రూల్స్ను బ్రేక్ చేసినందుకు రెండేళ్ల పాటు ఎలాంటి క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
అబుదాబి టీ10 లీగ్లో 2020-21 సీజన్లో పుణే డెవిల్స్కు నాసిర్ హుస్సేన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ లీగ్ సమయంలో నాసిర్ హుస్సేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ అతనిపై గతేడాది అభియోగాలు నమోదు చేసింది.

ఈ అంశంపై విచారణ చేపట్టిన ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగం.. నాసిర్ హుస్సేన్ తప్పు చేసినట్లు గుర్తించింది. ఖరీదైన ఐఫోన్ ను గిఫ్ట్గా పొందడంతో పాటు ఆ మొబైల్ సాయంతో బుకీలతో మాట్లాడటం వంటి విషయాలను తమ విచారణలో గుర్తించింది. ఇక బుకీలు తనను సంప్రదించినప్పుడు ఐసీసీకి సమాచారం ఇవ్వకపోవడం.. విచారణకు కూడా సహకరించకపోవడంతో అతనిపై నిషేధం విధిస్తూ ఐసీసీ చర్యలు తీసుకుంది.
ఐసీసీ నిర్ణయంతో నాసిర్ హుస్సేన్ 2025 ఏప్రిల్ 7 వరకు ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేదు. బంగ్లాదేశ్ తరఫున 19 టెస్ట్లు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడిన నాసిర్ హుస్పేన్.. చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2018లో ఆడాడు.