ఐసీసీ ప్రతిష్టాత్మక టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రేసులో భారత్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ నిలిచాడు. గతేడాది టెస్ట్ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నలుగురు ఆటగాళ్లను ఐసీసీ ఈ అవార్డ్ కోసం ఎంపిక చేసింది. ఈ నామినీస్ వివరాలను శుక్రవారం వెల్లడించింది.
టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచారు.

రవిచంద్రన్ అశ్విన్..
గతేడాది ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ 41 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో పోటీపడటం అశ్విన్కు ఇది మూడోసారి. 2016లో తొలిసారి ఈ అవార్డును అందుకున్న అశ్విన్.. 2021లో నామినేట్ అయ్యాడు. గతేడాది టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
సొంతగడ్డపై ఆసీస్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా అశ్విన్ రికార్డు సాధించాడు. మొత్తం 114 వికెట్లతో అనిల్ కుంబ్లే (111 వికెట్లు)ను అధిగమించాడు.
ట్రావిస్ హెడ్..
గతేడాది 12 మ్యాచ్లు ఆడిన ట్రావిస్ హెడ్ 919 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ఆసీస్ విజయం సాధించడంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ సిరీస్లోనూ ట్రావిస్ హెడ్ సత్తా చాటాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో చెలరేగి ఆసీస్ను విశ్వవిజేతగా నిలబెట్టాడు.76/3 పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
ఉస్మాన్ ఖవాజా
గతేడాది 13 మ్యాచ్లు ఆడిన ఉస్మాన్ ఖవాజా 1210 రన్స్ చేశాడు. ఉస్మాన్ ఖవానా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు రేసులో నిలవడం ఇది రెండోసారి. 2022లో ఈ అవార్డకు నామినేట్ అయిన అతను.. గతేడాది అదే జోరును కనబర్చాడు. భారత్తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 333 పరుగులతో సత్తా చాటాడు. యాషెస్ సిరీస్లోనూ 496 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
జోరూట్..
గతేడాది 8 మ్యాచ్లు ఆడిన జోరూట్ 787 పరుగులతో సత్తా చాటాడు. ఈ అవార్డ్ రేసులో జోరూట్ రెండో సారి నిలిచాడు. 2021లో అతను టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకున్నాడు. యాషెస్ సిరీస్తో పాటు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో జోరూట్ సత్తా చాటాడు.