ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. అప్కమింగ్(2024-2027) ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లన్నీ తటస్థ వేదికగానే జరుగుతాయని పేర్కొంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీతోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
భారత్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ 2025, పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని పేర్కొంది. హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించినందుకు ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులను రివార్డ్గా ఇచ్చినట్లు తెలిపింది.

2029-2031 మధ్య జరిగే ఐసీసీ మహిళల టోర్నీని ఆస్ట్రేలియా నిర్వహిస్తదని పేర్కొంది . పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను అతి త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. 2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగ్గా.. ఫైనల్లో భారత్ను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్తో పాటు మొత్తం 8 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన తటస్థ వేదిక ఏంటో ఐసీసీ వెల్లడించలేదు.
దుబాయ్ వేదికగానే భారత్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఐసీసీ వాయిదా వేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్థాన్కు పంపించలేమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ.. ఐసీసీని కోరింది.
తమ ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించేందుకు మొదట్లో పీసీబీ అంగీకరించలేదు. తమకు తీవ్ర నష్టం జరుగుతోందని వాదించింది. కానీ ఐసీసీ గట్టిగా వాదించడంతో తమకు నష్ట పరిహారంతో పాటు భారత్ వేదికగా జరిగే టోర్నీల్లో తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్కు భారత్ అంగీకరించలేదు. కానీ సుదీర్ఘ చర్చలు, సమావేశాల అనంతరం ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది.