మహిళల వన్డే ప్రపంచకప్ 2025 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారి మహిళలతో కూడిన పూర్తి స్థాయి అంపైర్ ప్యానెల్, మ్యాచ్ అఫిషియన్స్ జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక వేదికగా జరిగే ఈ టోర్నీలో షాండర్ ఫ్రిట్జ్, ట్రూడీ ఆండర్సన్, జి.ఎస్. లక్ష్మి, మిచెల్ పెరీరా మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు.
ఎంతో అనుభవం కలిగిన క్లైర్ పోలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్ఫెర్న్లు 14 మంది సభ్యులతో కూడిన అంపైర్స్ ప్యానెల్లో ఉన్నారు. గత రెండు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లు, 2022లో బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పూర్తిగా మహిళా అధికారులు బాధ్యతలు చేపట్టినప్పటికి 13 ఏళ్ల మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మాత్రం ఇదే తొలిసారి.

ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఐసీసీ ఛైర్మన్ జై షా ప్రశంసించాడు. ఈ నిర్ణయం మహిళల క్రికెట్ను మరింత ప్రోత్సహిస్తుందని, మరింత మంది మహిళలు ఈ ఆటను కెరీర్గా ఎంచుకుంటారని చెప్పారు. 'మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఓ సంచన నిర్ణయం. ఇది మహిళల క్రికెట్ మరింత అభివృద్ధి చెందేలా చేస్తుంది. పూర్తిగా మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్ను ప్రకటించడం ఓ రికార్డ్ మాత్రమే కాదు. క్రికెట్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఐసీసీ చేస్తున్న కృషికి ప్రతిబింబం ఇది.'అని జై షా తెలిపారు.
ఈ టోర్నీలో పాల్గొనే 8 జట్లు బరిలోకి దిగుతుండగా.. ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక మధ్య సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది.
మహిళల ప్రపంచ కప్ 2025కి మ్యాచ్ అధికారులు
అంపైర్లు: లారెన్ ఏజెన్బాగ్, కాండస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షాతిరా జాకిర్ జెసీ, కెర్రిన్ క్లాస్టే, జననీ ఎన్, నిమలి పెరీరా, క్లైర్ పోలోసాక్, వ్రిందా రాఠీ, స్యూ రెడ్ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలిన్ విలియమ్స్
మ్యాచ్ రిఫరీలు: ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జి.ఎస్. లక్ష్మి, మిచెల్ పెరీరా