న్యూఢిల్లీ: క్రికెట్లో లింగ సమానత్వం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో పురుష, మహిళా క్రికెటర్ల టోర్నీ అనే తేడా లేకుండా ఒకే రకమైన ప్రైజ్మనీని అందివ్వనుంది. క్రికెట్లో లింగ సమానత్వం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే భారత క్రికెట్లో సమాన వేతనాలు అందిస్తున్న బీసీసీఐ.. ఐసీసీ నిర్వహించే టోర్నీల ప్రైజ్మనీలోనూ వ్యత్యాసం లేకుండా చూడాలని ఐసీసీని కోరింది. ఐసీసీ బోర్డులోని ఇతర సభ్యులు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఐసీసీ.. మెగా టోర్నీల ప్రైజ్మనీ విషయంలో వ్యత్యాసం లేకుండా నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'క్రికెట్లో కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చాం. లింగ సమానత్వం కోసం మరో అడుగు ముందుకు వేసామని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక నుంచి ఐసీసీ ఈవెంట్స్లో పురుష, మహిళా క్రికెటర్లు అనే తేడా లేకుండా ఒకే విధమైన ప్రైజ్మనీ ఉంటుంది. ఈ ప్రతిపాదనకు సహకరించిన సహచర బోర్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను విస్తరించేందుకు ఇది సహకరిస్తోంది.'అని జై షా ట్వీట్ చేశాడు.
ఇక ఐసీసీ కూడా ఈ కీలక మార్పు గురించి ఓ ప్రకటనను విడుదల చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఇదో ముఖ్యమైన నిర్ణయమని, ఇక నుంచి ఐసీసీ ఈవెంట్స్లో పురుష, మహిళా క్రికెటర్లు సమానంగా రివార్డు అందుకోనుండటం సంతోషించదగిన విషయమని ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే తెలిపారు.
2017 నుంచి మహిళా ఈవెంట్స్ ప్రైజ్మనీ పెంచుతూ వచ్చామని, ఇప్పుడు ఏకంగా పురుషులతో సమానంగా ఇచ్చేందుకు సిద్దమయ్యామని తెలిపాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్లతో పాటు అండర్ 19 ప్రపంచకప్లోనూ పురుషులతో సమంగా క్యాష్ రివార్డ్స్ లభిస్తాయని చెప్పారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2020, 2023 విజేత, రన్నరప్ టీమ్స్కు 1 మిలియన్ అమెరికా డాలర్లు, 5 లక్షల అమెరికా డాలర్లు ప్రైజ్ మనీ దక్కింది. 2018తో పోల్చితే ఈ మొత్తం ఐదు రెట్లు ఎక్కువ.