
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. 2022 బర్మింగ్హామ్లో జరిగే గేమ్స్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) బుధవారం విడుదల చేశాయి.
దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో టాప్ సిక్స్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్లో ఉంది.
చివరిదైన ఎనిమిదో బెర్త్ను 'కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ'విన్నింగ్ టీమ్తో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే.
1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.