
న్యూఢిల్లీ: ఓపెనర్గా బరిలోకి దిగడమే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ని కాపాడిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకోవడానికి కూడా ఇదే కారణమని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన తర్వాతనే రోహిత్ శర్మ తిరిగి పుంజుకోగలిగాడని తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో శతక్కొట్టిన రోహిత్ శర్మ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడ్డ పిచ్పై హిట్ మ్యాన్ ఓపికగా ఆడి సెంచరీ సాధించాడు. దాంతో రోహిత్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ ఇన్నింగ్స్ను కొనియాడిన ఇయాన్ చాపెల్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా వెళ్లడం రోహిత్ శర్మ కెరీర్ను కాపాడింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి తన అపారమైన నైపుణ్యాన్ని వృథా చేసుకునేలా కనిపించాడు. కానీ, ఓపెనర్గా ఆడి మెరుగయ్యాడు. అప్పుడు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ కి ఉన్న పాపులారిటీ వల్ల రోహిత్కు తగినంత గుర్తింపు దక్కలేదు. రోహిత్ తిరిగి పుంజుకోవడంలో కెప్టెన్సీ కూడా ప్రధాన పాత్ర పోషించింది. జట్టును నడిపించడానికి అవసరమైన క్రమశిక్షణ రోహిత్ ఆటతీరును మరో స్థాయికి తీసుకెళ్లింది. నాగ్పుర్ టెస్టులో పిచ్ను అర్థం చేసుకుని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇరు జట్ల ఆటగాళ్లకు భారత పిచ్లపై ఎలా ఆడాలో చూపించాడు. రవీంద్ర జడేజా కొద్దిమేరకు అతడి తరహాలో ఆడాడు' అని ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు.
ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. భారీ విజయంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వగా.. ఘోర పరాజయంతో ఆసీస్ చతికలపడింది. చేసిన తప్పిదాలను గుర్తించి సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టిన ఆసీస్.. ఢిల్లీ టెస్ట్లో విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది. తుది జట్టులో మార్పులు చేయడంపై కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నాగ్పూర్ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్పై ప్రాక్టీస్ సెషన్ నిర్వహించిన ఆసీస్.. వికెట్ స్వభావం తెలుసుకోవడంతో పాటు భారత స్పిన్ విభాగానికి కౌంటర్ అటాక్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దాంతో రెండో టెస్ట్ కూడా అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది.