న్యూఢిల్లీ: డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. డీఆర్ఎస్ వల్ల అంపైర్లపై క్రికెటర్లలో అసమ్మతి పెరుగుతుందని, దీనిపై తనకు అంత నమ్మకం లేదన్నాడు. ఆదివారం ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు రాసిన కాలమ్లో డీఆర్ఎస్ను ప్రక్షాళన చేయాలని సూచించాడు.
ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్లో డీఆర్ఎస్ వినియోగం మరీ దారుణంగా మారిందని రాసుకొచ్చాడు.'డీఆర్ఎస్ విధానం వల్ల ఆటగాళ్లకు అంపైర్ల పట్ల విధేయత తగ్గుతున్నది. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్ట్లో ఈ విషయం స్పష్టమైంది. అంపైర్లు ఇచ్చిన అధిక నిర్ణయాలను ఆటగాళ్లు సవాల్ చేసారు. ఈ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి. అందుకే దీన్ని ప్రవేశపెట్టిన కొత్తలో బీసీసీఐ వ్యతిరేకించింది'అని పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్-వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్లో అంపైర్ల తప్పిదాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి కూడా ఇంగ్లండ్కు అనుకూలంగా ఉండటంతో అనేక అనుమానాలు రేకెత్తాయి.
డిఆర్ఎస్ విషయంలో 'అంపైర్స్ కాల్' అనే నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని అపెక్స్ బోర్డుకు సూచించాడు. 'ఇక్కడ బంతి ఎంత శాతం వికెట్లను తాకిందనేది అనవసరం. రివ్యూలో బంతి వికెట్లు తాకితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఔటివ్వాల్సిందే. క్రికెట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యమే ఇది. అయితే టెక్నాలజే 100 శాతం సరైనదని చెప్పలేం. కానీ మానవులతో పోలిస్తే కొంచెం బెటరే'అని సచిన్ చెప్పుకొచ్చాడు.