
ప్రమాదకరంగా భారత్..
'అన్ని అడ్డంకులు అధిగమించిన టీమిండియా ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. ఇప్పుడు కోహ్లీ కూడా చేరడంతో మరింత బలంగా మారింది. రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ లాంటి ఆటగాళ్లు ఈ సిరీస్కు ఎంపికైన నేపథ్యంలో భారత్ మరింత ప్రమాదకరంగా అనిపిస్తోంది. ఇటు ఇంగ్లండ్ జట్టులో బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ చేరికతో పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. అయితే, ఇంగ్లండ్ టాప్ ఆర్డర్పైనే సందిగ్ధత నెలకొంది' అని చాపెల్ పేర్కొన్నాడు.

జోరూట్ పైనే ఒత్తిడి..
'టీమిండియా టాపార్డర్లో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా ఉన్నారు. ఈ ముగ్గురూ ప్రస్తుతం బాగా ఆడుతున్నారు. అదే ఇంగ్లండ్ జట్టు టాప్ ఆర్డర్లో రోరీ బర్న్స్ కొత్తగా చేరాడు. ఒకవేళ డామ్ సిబ్లీ, బర్న్స్ రాణించకపోతే కెప్టెన్ జోరూట్పై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే శ్రీలంకలో విఫలమైన జాక్ క్రాలే ఇక్కడ రాణించాలి. అతను నిలదొక్కుకునేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఇంగ్లండ్ పేస్ విభాగానికి వస్తే అనుభవజ్ఞులైన అండర్సన్, స్టువార్ట్బ్రాడ్ ఉన్నారు. వారికి తోడు ఆర్చర్ చేరడంతో భారత్ కన్నా కాస్త మెరుగ్గా అనిపిస్తోంది' అని ఆసీస్ మాజీ సారథి వివరించాడు.

స్విచ్ హిట్ బ్యాన్ చేయాలి..
క్రికెట్లో స్విచ్ హిట్ షాట్లకు చరమగీతం పాడాలని కొద్ది రోజుల క్రితం ఇయాన్ చాపెల్ వివాదాస్పద రీతిలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. 'స్విచ్ హిట్టర్లకు ఇది చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ షాట్ను బ్యాన్ చేయడమే మార్గం. లేకపోతే ఆ బాల్ను డెడ్బాల్గా ప్రకటించాలి' అని పేర్కొన్నాడు. ఇది ఫీల్డ్ అంపైర్లకు అదనపు పనిగా మారిపోతుందని అంతర్జాతీయ మాజీ అంపైర్ సైమన్ టైఫల్ పేర్కొన్నాడు. అది స్విచ్ హిట్ అవునా.. కాదా అనే విషయాన్ని అంచనా వేయడం అంపైర్లకు కొన్ని సందర్భాల్లో కఠినంగా మారిపోతుందన్నాడు. అయితే దీనితో చాపెల్ విభేదించాడు. ఇది కాస్త కఠినతరమే అయినా తప్పదన్నాడు.


Click it and Unblock the Notifications












