
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో పేలవ బ్యాటింగ్తో విఫలమవుతున్న విరాట్ కోహ్లీ చూస్తే జాలేస్తుందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ అన్నాడు. ఒకప్పుడు మైదానంలో కింగ్గా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు తీవ్రంగా తడబడుతున్నాడని చెప్పాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనలేక వికెట్ పారేసుకుంటున్నాడని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లోనూ కోహ్లీ విఫలమయ్యాడు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి మంచి ఆరంభం ఇచ్చినప్పటికి.. అదే జోరును మ్యాచ్ మొత్తం కొనసాగించలేకపోయాడు. 33 బంతుల్లో 30 పరుగులతో వన్డే తరహా బ్యాటింగ్ చేసిన కోహ్లీ చివరకు ఆఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. గతేడాది చెన్నైలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో కోహ్లీఇదే తరహాలో మొయిన్ అలీ బౌలింగ్లోనే క్లీన్బౌల్డ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'కోహ్లీ బ్యాటింగ్ తీరును చూస్తుంటే జాలేస్తోంది. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడిన కోహ్లికి ఇప్పుడదే పెద్ద బలహీనతగా మారింది. పేస్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్స్ దిశగా సూపర్ సిక్స్ కొట్టిన కోహ్లీ.. స్పిన్నర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. బౌండరీలు కొట్టలేని స్థితిలో సింగిల్స్తోనే వేగంగా ఆడే కోహ్లీ ఇప్పుడు కనిపించడం లేదు. కోహ్లీ హాఫ్ సెంచరీ కొడితే అందులో 10-15 పరుగులు కేవలం సింగిల్స్ రూపంలో వచ్చేవి. అలాంటి కోహ్లీ స్పిన్ బౌలింగ్లో ఫేలవంగా ఆడుతున్నాడు. అయితే అతనికి ఇది కొత్త మాత్రం కాదు. గత సీజన్తో పాటు.. పలు అంతర్జాతీయ మ్యాచ్ల్లో స్పిన్ ఆడడంలో విఫలమవుతూ వస్తున్నాడు. అందుకే కోహ్లీని చూస్తే జాలేస్తోంది.'అని ఇయాన్ బిషప్ చెప్పుకొచ్చాడు.
ఇక చెన్నైతోమ్యాచ్లో మొత్తం 16 డాట్ బాల్స్ ఆడిన కోహ్లీ... గ్లేన్ మ్యాక్స్వెల్ను రనౌట్ చేశాడు. అనవసర రన్కు ప్రయత్నించి జట్టుకు తీరని నష్టం చేశాడు. కోహ్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 178 పరుగులు మాత్రమే చేసాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మహిపాల్ లొమ్రోర్ (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. కాన్వే (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' హర్షల్ పటేల్ (3/35) కీలక వికెట్లు తీశాడు.