క్రికెట్ కోసం ఎగ్జామ్స్ రాయనని తన తండ్రిని తరుచూ బెదించేదానినని టీమిండియా యువ స్పిన్నర్, తెలుగు తేజం శ్రీ చరణి తెలిపింది. అథ్లెటిక్స్, ఖోఖోలో రాణిస్తున్న తాను సడెన్గా క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంటానంటే తన తండ్రి ఒప్పుకోలేదని, రెండేళ్లు సతాయిస్తే ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అర్థశతాబ్దపు నిరీక్షణ తెరదించిన హర్మన్సేన తొలి ప్రపంచకప్ను ముద్దాడింది. ఫైనల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది.
ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది.

వన్డే ప్రపంచకప్ ముందు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో జరిగిన ఇంటరాక్షన్లో శ్రీ చరణి తన క్రికెట్ ప్రయాణం గురించి పంచుకుంది. క్రికెట్ ఆడేందుకు ఎగ్జామ్స్ రాయనని తరుచు బెదిరించేదానని తెలిపింది. తన మాటలతో నారా లోకేష్తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా పగలబడి నవ్వారు. తాజా ప్రపంచకప్ విజయంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
'మాది ఆంధ్రప్రదేశ్లోని కడప. నా 7-8 ఏళ్ల వయసులోనే మా మామ ద్వారా క్రికెట్ ఆడటం ప్రారంభించాను. మా ఊరిలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే సౌకర్యాలు ఏం లేవు. గల్లీ క్రికెట్ మాత్రమే ఆడేదాన్ని. ఖోఖో, అథ్లెటిక్స్కు సంబంధించిన వసతులు ఉన్నా.. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం మాత్రం లేదు. నా 9వ తరగతి పూర్తయిన తర్వాత నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఈ విషయం మా తల్లిదండ్రులకు చెబితే.. మొదట్లో ఒప్పుకోలేదు.
రెండేళ్ల తర్వాత నా మొండితనాన్ని భరించలేక క్రికెట్ ఆడేందుకు అంగీకరించాడు. కానీ ఆయన ఒప్పుకునే సమయానికి కోవిడ్ వచ్చింది. దాంతో రెండేళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది(నవ్వుతూ). కోవిడ్ 19 తర్వాత అండర్ 19 ప్రాబబుల్స్లో నేను ఎంపికయ్యాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తరఫున స్టేట్ మ్యాచ్లు ఆడాను. అదే ఏడాది అండర్ 19 ఛాలెంజర్స్ టోర్నీ ఆడాను. రెండేళ్లు ఈ టోర్నీ ఆడాను. ఐదేళ్ల ప్రొఫెషనల్ క్రికెట్ జర్నీ తర్వాత నాకు డబ్ల్యూపీఎల్ ఆడే అవకాశం దక్కింది. ఆ టోర్నీలో రాణించడంతో టీమిండియాకు ఎంపికయ్యాను.'అని చెప్పింది.
మీ తండ్రిని ఎలా ఒప్పించారు? అని ఈ ప్రోగ్రామ్ హోస్ట్ అడగ్గా..'నేను తరుచూ ఎగ్జామ్స్ రాయనని బెదిరించేదాన్ని. ప్రొఫెషనల్ క్రికెట్కు ఒప్పుకుంటేనే పరీక్షలు రాస్తానని బ్లాక్మెయిల్ చేసేదాన్ని. నా ఇంటర్ పూర్తయిన తర్వాత మా నాన్న క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాడు.'అని బదులిచ్చింది. దాంతో అక్కడ మళ్లీ నవ్వులు పూసాయి.