ఐపీఎల్లో ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప.. కోల్కతా నైట్రైడర్స్ తరఫునే ఎక్కువ కాలం ఆడాడు. అయితే ఐపీఎల్ 2014 విజయం తర్వాత ఆ జట్టును వీడాలనుకున్నానని తాజాగా రాబిన్ ఊతప్ప వెల్లడించాడు. పుణే వారియన్స్ ఇండియా(పీడబ్ల్యూఐ) ఫ్రాంచైజీని బీసీసీఐ తొలగించడంతో ఐపీఎల్ 2014 మెగా వేలంలో రాబిన్ ఊతప్పను కేకేఆర్ రూ. 5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఆ సీజన్లో రాబిన్ ఊతప్ప అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 44 సగటుతో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ అనంతరం కేకేఆర్ను వదిలేయాలనుకున్నానని, తనకు ఉన్న డిమాండ్ను వేలంలో క్యాష్ చేసుకోవాలనుకున్నానని రాబిన్ ఊతప్ప తెలిపాడు.

తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'పుణె వారియర్స్ ఇండియా తర్వాత నన్ను కేకేఆర్ రూ. 5 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ 2014 సీజన్లో మేం విజేతగా నిలిచాం. నేను ఆరెంజ్ క్యాప్ అందుకున్నాను. అయితే ఆ జట్టు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను. వేలంలోకి వెళ్లి నా డిమాండ్ను క్యాష్ చేసుకోవాలనుకున్నాను. మనం ఇంకెన్నాళ్లు ఆడుతాం? మహా అయితే 35, 36 ఏళ్ల వరకు ఆడుతామని ఆలోచించా.
అప్పటికే నా వయసు 29 ఏళ్లకు చేరింది. దాంతో సాధ్యమైనంత మేరకు సంపాదించాలనుకున్నాను. ఇదే విషయాన్ని కేకేఆర్ లీడర్షిప్ గ్రూప్కు చెప్పాను. కానీ నన్ను వదులుకునేందుకు వారు నిరాకరించారు. తమ కోసమే ఆడాలని చెప్పారు. సుదీర్ఘ కాలం ఈ జట్టు తరఫున ఆడాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆ సమయంలో నా కాంట్రాక్ట్ ప్రకారం ఉన్న రూ. 5 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే అవకాశం లేదు. అందుకే నేను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నేను కేవలం ఒక ప్రయత్నం మాత్రమే చేయాలనుకున్నా. అలా మాట్లాడటం కూడా నాకు ఉపయోగపడింది.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.