
హైదరాబాద్: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ప్రస్తుతం లండన్లో లలిత్ మోడీ హిమాన్షు రాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీటర్ వేదికగా సంతాపం తెలిపారు.
'ఐ రియల్లీ మిస్ యూ. నీ ఉద్యోగ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. కానీ నీ ఆత్మహత్యకు కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మా గుండెల్లో ఎప్పుడూ నీవు చిరస్థాయిగా ఉంటావు. ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో.. ఇక నీకు ఏ బాధ ఉండదూ. నీవు ఒక మెరిసే నక్షత్రానివి' అని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
శుక్రవారం హిమాన్షు రాయ్ ముంబైలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హిమాన్షు రాయ్ 2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ అధికారిగా ఉన్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ను అరెస్ట్ చేశారు. దీంతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో హిమన్షు కీలక పాత్ర పోషించారు.
కాగా, హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు 'మరాఠీ దినపత్రిక లోక్మఠ్' పేర్కొంది. ఇందులో భాగంగానే ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.