టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి వేటుకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మాట్లాడాడు. కెప్టెన్సీ మార్పుపై నేరుగా మాట్లాడకపోయినా.. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. జట్టు విజయం కోసం కృషి చేస్తానని, ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. CEAT అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ.. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్గా భారత జట్టుకు తాను ఎంతో చేశానని, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి అనేక మార్పులు తీసుకొచ్చానని తెలిపాడు. తాము తీసుకొచ్చిన విధానాల వల్లే టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిందన్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై ఆడటం తనకు చాలా ఇష్టమని, అక్కడి పరిస్థితులు సవాల్తో కూడుకున్నవని తెలిపాడు. 'నాకు అవకాశం దొరికినప్పుడల్లా మూడు ఫార్మాట్లలో రాణించేందుకు ప్రయత్నించాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నాలానే ఇతర ఆటగాళ్లు కూడా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు సేవలు అందించారు. అది జట్టుపై సానుకూల ప్రభావం చూపింది.
ఆస్ట్రేలియాతో ఆడటం నాకు చాలా ఇష్టం. అక్కడి కండిషన్స్ సవాల్తో కూడుకున్నవి. అక్కడి ప్రజలు కూడా ఆటను ప్రేమిస్తారు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో ఆడిన ప్రతీసారి మాకు భిన్నమైన సవాల్ ఎదురువుతుంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు చాలా సార్లు వెళ్లిన అనుభవం నేపథ్యంలో అక్కడ ఎలా రాణించాలో మాకు తెలుసు. జట్టు కోసం చేయాల్సింది చేస్తాం. ఆశించిన ఫలితాన్ని అందుకుంటాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2027 నేపథ్యంలో సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. శుభ్మన్ గిల్ను నయాసారథిగా ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం ప్లేయర్స్గా మాత్రమే జట్టులో కొనసాగనున్నారు. మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కొనసాగుతారనే విషయాన్ని ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు టీమ్మేనేజ్మెంట్ హింట్ ఇచ్చింది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.