స్వేచ్ఛగా ఆడటంతోనే తాను మునపటిలా రాణించగలిగానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇప్పటికీ జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.
మూడు వన్డేల్లో రెండు శతకాలు, అజేయ హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్గా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సిరీస్తో 2-1తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచిన కోహ్లీ.. తన ఆటతీరు సంతృప్తినిచ్చిందని తెలిపాడు. గత 2-3 ఏళ్లలో ఇలా ఆడలేకపోయానని చెప్పుకొచ్చాడు.
'ఈ సిరీస్లో నేను ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం నా మనసు చాలా తేలికగా ఉంది. గత 2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు. నేను ఇలా ఆడితే జట్టుకు బాగా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఈ ప్రదర్శన నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనైనా నేను రాణించగలను. జట్టుకు గెలుపు బాట వేయగలను. నా సొంత ప్రమాణాలను కొనసాగించడానికి, జట్టు విజయాల్లో భాగమయ్యేందుకు ప్రయత్నించాను. పరిస్థితులకు అనుగుణంగా నేను ఎక్కువసేపు బ్యాటింగ్ చేయగలను.

15-16 ఏళ్ల నుంచి ఆడుతుంటే.. మీకు సందేహం కలిగే దశలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు భయాందోళనకు గురవుతారు. ముఖ్యంగా బ్యాటింగ్లో ఒక చిన్న పొరపాటు మీకు నష్టం కలిగించవచ్చు. ఇది ఒక ప్రయాణం, మెరుగుపడటం, మంచి వ్యక్తిగా మారడం ముఖ్యం. నా ప్రతికూల ఆలోచనలను నేను గుర్తించగలను. వాటిని తెలుసుకొని, వాటిపై పనిచేయడం నా టెంపర్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఇప్పటికీ జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను స్వేచ్ఛగా ఆడితే సిక్సర్లు కొట్టగలను. నా పరిమితులను ఛేదించి, బాగా ఆడాలని మాత్రమే కోరుకున్నాను.
ఈ సిరీస్లో నా తొలి ఇన్నింగ్స్ అత్యుత్తమమైనది. ఆస్ట్రేలియా తర్వాత నేను క్రికెట్ ఆడలేదు. ఆ రోజు లభించిన ఉత్సాహం రిస్క్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఈ సిరీస్లో మ్యాచ్లు సాగిన తీరుకు నేను కృతజ్ఞుడను. కచ్చితంగా గెలవాలనే పరిస్థితులు మాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీస్తాయి. నేను ఒక మంచి ఆటగా ఆడాలని కోరుకుంటాను. ఇప్పటికీ రోహిత్, నేను జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దం సుదీర్ఘ కాలం నుంచి కలిసే ఆడుతున్నాం. జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.