టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్పై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ఎప్పుడూ చూడని ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. మధ్యాహ్నం భోజనంలో ఏం తిన్నాడో తెలియదు కానీ తనకు బ్యాటింగ్ ఇవ్వకుండా చెలరేగాడని చమత్కరించాడు. నాన్ స్ట్రైకర్గా అతని విధ్వంసాన్ని ఆస్వాదించానని తెలిపాడు.
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 82 నాటౌట్)తో పాటు ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 76) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ సంభ్రమాశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు. 'లంచ్లో ఇషాన్ కిషన్ ఏం తిన్నాడో నాకైతే తెలియదు కానీ.. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి పవర్ ప్లేలో జట్టు స్కోర్ 60 పరుగులు దాటించడం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. మా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడాలనేదే మా కోరిక. అది ఈ మ్యాచ్లో కనిపించింది.

పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ నాకు స్ట్రైక్ ఇవ్వనందుకు కొంచెం కోపం వచ్చింది(నవ్వుతూ) కానీ ఆ సమయంలో నేను ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోగలిగాను. గతంలో చెప్పినట్లుగా నేను నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మ్యాచ్కు ముందు కూడా మంచి ప్రాక్టీస్ సెషన్ లభించింది. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ 110/2 స్కోర్తో ఉన్నప్పుడు.. 230 పరుగులు చేస్తారని భావించా. కానీ మా బౌలర్లు సమష్టిగా రాణించి వికెట్లు తీసారు. తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. ప్రస్తుత ఫలితాలను నేను ఆస్వాదిస్తున్నా. జట్టు వాతావరణం బాగుంది. ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా.'అని సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్(6), అభిషేక్ శర్మ(0) విఫలమైనా.. ఇషాన్ కిషన్, సూర్య, శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 35 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫీ, ఇష్ సోధీ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగనుంది.