ఒంటరి జీవితం నరకంగా ఉందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అన్నాడు. తన జీవితంలో అన్ని చూశానని, చావడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. తాను ప్రేమించిన వారంతా దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో సాధించాల్సింది, అనుభవించేది ఏది లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో 62 ఏళ్ల యోగ్రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
'నేను సాయంత్రం ఒంటరిగా కూర్చుంటాను. నా ఇంట్లో ఎవరూ ఉండరు. తిండి కోసం ఇతర వ్యక్తులపై ఆధారపడుతాను. కొన్నిసార్లు ఒకరు పెడితే.. మరికొన్ని సార్లు మరొకరు తెచ్చిస్తారు. అయితే ఆహారం కోసం నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టను. నాకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరో ఒకరు ఆహారం తెచ్చిస్తారు. నా వంట కోసం పనివారిని పెట్టుకున్నాను. వారు వారి పని చేసుకొని వెళ్లి పోతారు.
నాకు మా అమ్మ, పిల్లలు, కోడలు, మనవలు, కుటుంబంలోని ప్రతీ ఒక్కరితో కలిసి ఉండాలని ఉంది. కానీ నేను ఎవర్నీ నాతో ఉండమని అడగను. నేను చావడానికి సిద్దంగా ఉన్నాను. నా జీవితం పూర్తయింది. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నన్ను తీసుకెళ్లవచ్చు. ఆ దేవుడికి నేను చాలా కృతజ్ఞుడిని. నేను కోరిన ప్రతీ కోరికను నెరవేర్చాడు.

యువరాజ్ సింగ్, అతని తల్లి నన్ను విడిచి వెళ్లడం నా జీవితంలోనే అతి పెద్ద షాక్. నా జీవితం, నా యవ్వనాన్ని ఎవరి కోసం అంకితం చేశానో.. ఆమెనే నన్ను వదిలి వెళ్లిపోయింది. ఈ విధంగా నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నేను అందర్నీ బాగా చూసుకున్నప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆ దేవుడని అడిగాను. నేను కొన్ని తప్పులు చేసి ఉండచ్చు. కానీ నేను ఎవరికీ కీడు చేయలేదు. నేను అమాయకుడిని. ఆ దేవుడు ముందు ఎంతో ఏడ్చాను. ఆయనే నన్ను కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాడు.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కానీ వృద్దాప్యంలో నాకు ఎవరూ తోడుగా లేరు. ఇది దేవుడి ఆట. ఆయనే నా రాతను ఇలా రాసిపెట్టాడు. చాలా కోపంతో పగ తీర్చుకోవాలనే కసితో ఉండేవాడిని. ఆ తర్వాత క్రికెట్ నా జీవితాన్ని మార్చేసింది. నా కెరీర్ ఆగిపోయిన తర్వాత యువరాజ్ సింగ్ను క్రికెట్ ఆడించాను. వాడు అద్భుతంగా ఆడాడు. కానీ వాడు కూడా నన్ను వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలను కన్నాను. వారు కూడా నన్ను వదిలి అమెరికాకు వెళ్లిపోయారు. కాలం గడిచిపోయింది. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. ఇలా ఎందుకు చేశానా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. ఇప్పుడు నీతో ఎవరైనా ఉన్నారా? ఇది నీకు జరగాల్సిందేనని అనుకుంటా.'అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
యోగ్ రాజ్ సింగ్ ముందు షబ్నమ్ కౌర్ను పెళ్లి చేసుకోగా.. యువరాజ్ సింగ్, జోరవర్ పుట్టారు. అయితే తరుచూ గొడవలు జరగడంతో ఈ ఇద్దరూ విడిపోయారు. తానే స్వయంగా విడాకులు తీసుకోవాలని తమ తల్లిదండ్రులకు చెప్పానని యువరాజ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ తర్వాత యోగ్ రాజ్ సింగ్ నీనా బంధెల్ అలియాస్ సత్బీర్ కౌర్ను పెళ్లి చేసుకోగా.. కొడుకు విక్టర్తో పాటు అమ్మాయి అమర్జోత్ పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు.. కానీ వీరు కూడా యోగ్రాజ్ సింగ్తో ఉండటం లేదు.