తనకు సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టమని, కానీ గుడ్డిగా ఏ మాత్రం ఆడనని టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబే అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటానికి తాను ప్రయత్నిస్తానని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది.
శివమ్ దూబే ఆల్రౌండ్(66, 2/35) ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సహచర బ్యాటర్లంతా ఇబ్బంది పడిన వికెట్పై శివమ్ దూబే అలవోకగా సిక్సర్లు బాదాడు. అరడజన్ సిక్సర్లు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన శివమ్ దూబే తన బ్యాటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'అవును.. ఈ వికెట్పై బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నేను బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాను. నా ఆటను ఆస్వాదించాను. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురైనప్పటికీ అధిగమించగలిగాను. ముఖ్యంగా నెదర్లాండ్స్ ఆఫ్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో నేను వరుసగా నాలుగు డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో బౌలర్కు అది మంచి ఓవర్ అయినా.. ఆ తర్వాత స్కోర్ను కవర్ చేయగలనని నాకు తెలుసు.
బంతి కొన్నిసార్లు స్కిడ్ అయ్యింది. మరికొన్నిసార్లు లో-బౌన్స్లో వచ్చింది. ఒక బంతి అయితే బాగా టర్న్ అయ్యింది. నేను ఆ బౌలర్ను కొట్టగలనని నాకు తెలుసు. కానీ అప్పటి పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంది. దాంతోనే నేను ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను బౌండరీలు, సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించాను.

నాకు సిక్సర్లు కొట్టడం చాలా ఇష్టం. కానీ పరిస్థితులను పట్టించుకోకుండా గుడ్డిగా ఆడలేను. బౌలర్ మంచి బంతులు వేస్తున్నప్పుడు.. అందుకు తగ్గట్లు బౌండరీ బాదేందుకు నన్ను నేను సిద్దం చేసుకుంటాను. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంపై నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే బౌలర్లు నన్ను బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని నాకు తెలుసు. వారు నాకు యార్కర్లు, లెంగ్త్ బాల్స్ వేయరు. అందుకు బదులుగా షార్ట్ బాల్స్, స్లోయర్ బాల్స్ వేస్తారు. అందుకే నేను సిద్ధంగా ఉండి, వాటి కోసం వేచి చూశాను.
మిడిల్ ఓవర్లలో నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు రన్ రేట్ను వేగంగా పెంచాలని కెప్టెన్, కోచ్ నాకు చెప్పారు. అయితే అది పూర్తిగా మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నేను క్రీజులోకి వచ్చినప్పుడు వెంటనే వేగంగా ఆడే పరిస్థితి లేదు. కానీ ఒకానొక సమయంలో మాత్రం 'ఇక నేను చెలరేగి ఆడాల్సిన సమయం వచ్చింది' అని నాకు అనిపించింది. నా బౌలింగ్పై కూడా నేను చాలా కష్టపడుతున్నాను. అందుకు తగ్గట్లుగా ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇది టీ20 మ్యాచ్ కొన్నిసార్లు పరుగులు ఇచ్చుకున్నా.. వికెట్లు వస్తాయి.'అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబే(31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో చెలరేగగా..తిలక్ వర్మ(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31), సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 34) దూకుడుగా ఆడలేకపోయారు.
అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/14) మూడు వికెట్లు తీయగా.. శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.