క్రికెటర్ అవుతానంటే.. సచిన్, కోహ్లీ అవుతావా? అని తన బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కలవాళ్లు ఎగతాళి చేశారని టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తెలిపాడు. వీడి గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావని, టైమ్ వృథా చేసుకుంటున్నావని తన తండ్రిని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారని హర్షిత్ రాణా గుర్తు చేసుకున్నాడు.
తాను టీమిండియాకు ఆడిన తర్వాత అందరూ మాట మార్చారని చెప్పాడు. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని తన తండ్రిని కొనియాడారని, అది తనకు వింతంగా అనిపించిందని తెలిపాడు. తనకు కూడా ఫోన్లు చేశారని, కానీ తాను ఎత్తలేదని పేర్కొన్నాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షిత్ రాణా.. చిన్నప్పడు తన చుట్టూ ఉన్నవారు డిస్కరేజ్ చేస్తూ అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు.

'మనకు ఒక్కసారిగా పేరు, ప్రఖ్యాతలు, గుర్తింపు రాగానే.. అప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తులంతా దగ్గరవుతారు. చిన్నప్పుడు నేను క్రికెటర్ అవుతానంటే నవ్విన నా సోదర సోదరీమణులు, మా బంధువులు.. అనవసరంగా వాడి కోసం కష్టపడుతున్నావంటూ మా నాన్నను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీడి వల్ల ఏం కాదు. క్రికెట్ ఆడిన ప్రతోడు సచిన్, కోహ్లీ అవుతాడా? అని హేళన చేశారు.
వాళ్లే ఇప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి నీ కష్టానికి ఫలితం దక్కిందంటూ పొగడటం వింతగా అనిపిస్తుంది. వాళ్లు నాకు కూడా ఫోన్లు చేస్తారు. కానీ నేను అస్సలు ఎత్తను. ఇదే నా అటిట్యూడ్ కాదు. గతంలో వాళ్లు నన్ను చాలా హేళన చేశారు. అలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం.'అని హర్షిత్ రాణా ఆవేదన వ్యక్తం చేశాడు.
అండర్ 19 క్రికెట్తో భారత జట్టులోకి దూసుకొచ్చిన హర్షిత్ రాణా.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో రెండు టెస్ట్లు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడిన హర్షిత్ రాణా మూడు ఫార్మాట్లలో కలిపి 17 వికెట్లు తీసాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ తీసాడు.