
హైదరాబాద్: వచ్చే ఏడాది శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగనున్న టీ20, వన్డే సిరిస్ల్లో చోటు దక్కించుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది తాను వేలి గాయంతో బాధపడ్డానని అయితే ఇవేమీ తన ఆట తీరుపై ఏ మాత్రం ప్రభావం చూపలేవని ధావన్ తెలిపాడు.
ప్రస్తుతం ధావన్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బుధవారం నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు శిఖర్ ధావన్ మాట్లాడుతూ "ఇది నాకు కొత్త ఆరంభం. ఈ ఏడాది అంతా గాయాలతో సతమతమయ్యా. దీంతో పలు సిరీస్లకు దూరమయ్యా" అని అన్నాడు.
"అయితే, నేను లేని లోటును కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇది శుభపరిణామం. కొత్త ఏడాదిలో నేను సత్తాచాటడంపైనే దృష్టి పెట్టా. క్రికెట్ గేమ్లో గాయాలు అవడం సహజమే. వాటిని స్వీకరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు" అని ధావన్ అన్నాడు.
"నేను నా ఆటను మరిచిపోలేదు. క్లాస్ అనేది శాశ్వతం. నేను పరుగులు సాధిస్తా" అని ధావన్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో గాయం కారణంగా శిఖర్ ధావన్ టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన వెస్టిండిస్ పర్యటనకు దూరమయ్యాడు.
IPL Fantasy XI: గంగూలీ జట్టులో ధోనీకి దక్కని చోటు.. కెప్టెన్ ఎవరంటే!!
గాయం నుంచి కోలుకోవడంతో జనవరిలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగనున్న సిరిస్లకు సెలక్టర్లు శిఖర్ ధావన్ను ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి రావడంతో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధావన్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రాహుల్ చక్కటి ప్రదర్శన చేశాడు.
అయితే, టీ20 సిరీస్ నుంచి రోహిత్ శర్మ, మహ్మద్ షమిలకు విశ్రాంతినిచ్చారు. శ్రీలంకతో టీ20లకు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు కాబట్టి ధావన్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.