
న్యూఢిల్లీ: ఎట్టకేలకు దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ ఓ అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లో మూడో మ్యాచ్కు హైదరాబాద్ వేదికగా ఎంపికైంది. ఈ సిరీస్తో పాటు సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ల షెడ్యూల్, వేదికలను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది.
సెప్టెంబర్ 25వ తేదిన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆసీస్, భారత్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. చివరగా 2019 డిసెంబర్లో వెస్టిండీస్తో టీ20 మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. కాగా, ఆసీస్తో తొలి రెండు మ్యాచ్లకు మొహాలీ(సెప్టెంబర్ 20), నాగ్పూర్ (సెప్టెంబర్ 23) ఆతిథ్యం ఇస్తాయి.
అనంతరం సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో భారత్ తలపడుతోంది. సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3 తేదీల్లో జరిగే మూడు టీ20లను త్రివేండ్రం, గౌహతి, ఇండోర్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో వరుసగా రాంచీ, లక్నో, ఢిల్లీలో మూడు వన్డేలు జరుగుతాయి.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16న టీ20 ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత్కు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీలైనన్ని ఎక్కువ టీ20లను బీసీసీఐ నిర్వహిస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కంటే ముందే టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత్.. ఆస్ట్రేలియాకు వెళ్తుంది కాబట్టి సఫారీ సేనతో మ్యాచ్ల్లో ద్వితీయ శ్రేణి జట్టు తలపడుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
తీరిక లేని షెడ్యూల్ నేపథ్యంలో ఆటగాళ్ల వర్క్లోడ్పై టీమ్మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. సిరీస్ సిరీస్కు ఆటగాళ్లకు విశ్రాంతినిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన సీనియర్ ఆటగాళ్లకు వెస్టిండీస్ పర్యటనలోని వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది.