ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. ఆగస్ట్ 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి జోనల్ వ్యవస్థలోనే దులిప్ ట్రోఫీ జరగనుంది. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన కోసం దులీప్ ట్రోఫీని భారత టెస్ట్ టీమ్ ఆటగాళ్లతో నాలుగు జట్లుగా విభజించి నిర్వహించారు. ఈ సారి మాత్రం సంప్రదాయం ప్రకారమే జోనల్ వ్యవస్థలో నిర్వహించనున్నారు. గతేడాది నాలుగు జట్లతో దులిప్ ట్రోఫీ ఆడించడం వల్ల స్థానిక ఆటగాళ్లకు అవకాశాలు దక్కలేదనే విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ సారి పాత పద్దతిలోనే 6 జోన్ల జట్ల మధ్య దులీప్ ట్రోఫీ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైంది. నార్త్, సౌత్,ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ జరగనుంది. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ టోర్నీలో అవకాశం దక్కనుంది.

సౌత్ జోన్ కెప్టెన్గా తెలుగు తేజం, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఎమర్జింగ్ ఆసియాకప్లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇటీవల ఇంగ్లండ్ వేదికగా కౌంటీ క్రికెట్ ఆడిన తిలక్ వర్మ.. హాంప్షైర్ తరఫున అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ బాదాడు. ఈ ప్రదర్శనే అతనికి సౌత్ జోన్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేరళకు చెందిన మహ్మద్ అజారుద్దీన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అయితే దులీప్ ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉండనున్నాడు. ఆశ్చర్యకరంగా తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సాయి సుదర్శన్కు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే పక్కన పెట్టినట్లు అర్థమవుతోంది. తమిళనాడు నుంచి ఎన్ జగదీషన్, ఆర్ సాయి కిషోర్, గుర్బీత్ సింగ్ ఎంపికవ్వగా.. దేవదత్ పడిక్కల్, విజయ్ కుమార్ వైశాఖ్ కర్ణాటక నుంచి ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి తిలక్ వర్మతో పాటు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్ సౌత్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
తిలక్ వర్మ(కెప్టెన్), మహ్మద్ అజారుద్దీన్(వైస్ కెప్టెన్) తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్ , ఎన్. జగదీశన్ , టి. విజయ్, సాయి కిషోర్, టి. త్యాగరాజన్, వి. వైశాఖ్, నిధీష్ ఎం.డి., రికీ భుయ్, బాసిల్ ఎన్.పి., గుర్జప్నీత్ సింగ్, స్నేహాల్ కౌతంకర్.