ఉప్పల్ స్టేడియం ముందు హై డ్రామా.. జనవరి 10న హెచ్సీఏ ఎన్నికలు!

హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం ముందు హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం స్టేడియం గేటు బయట జరిగింది. ప్రత్యేక ఏజీఎం కోసం వచ్చిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్.. హెచ్సీఏ మాజీ అధ్యక్షులు జి.వినోద్లతో పాటు క్లబ్ల కార్యదర్శులను ఉప్పల్ మైదాన సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
దీంతో వారు స్టేడియం ప్రధాన గేటు ముందే టెంటు వేసుకుని, బ్యానర్ కట్టుకుని ప్రత్యేక ఏజీఎం నిర్వహించారు. జనవరి 10న ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేశారు. అనంతరం అజహర్ వ్యవహారశైలిపై వారంతా విరుచుకుపడ్డారు.

హెచ్సీఏ చరిత్రలోనే బ్లాక్ డే..
'75 ఏళ్ల హెచ్సీఏ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేక ఏజీఎం ద్వారా ఎన్నికల తేదీని నిర్ణయించాం. జనవరి 10న ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సంపత్ ఈసారి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అజారుద్దీన్ పదవీకాలం ముగిసినా తానే అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నాడు. రాజ్యాంగంపై అతనికి గౌరవం లేదు.
మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో చర్చించి ఉప్పల్ స్టేడియానికి స్థలం ఇప్పించాం. దగ్గరుండి స్టేడియాన్ని నిర్మించాం. ఈరోజు మమ్మల్నే లోపలికి అనుమతించలేదు. హెచ్సీఏ చరిత్రలో ఇది బ్లాక్ డే. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి'అని వినోద్, శివలాల్, అర్షద్, శేష్, జాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరుగుతోంది?
వర్గ పోరు, అధికార కాంక్షతో వివాదాలకు నిలయమైన హెచ్సీఏలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం సెప్టెంబర్ 26తోనే పూర్తయిందని, హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేక ఏజీఎం నిర్వహించి హెచ్సీఏ పెద్దలు ప్రకటించారు. కానీ ఎన్నికలు జరగాలా వద్దా? అని నిర్ణయించాల్సింది ఎవరు? అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. హెచ్సీఏలో పాలన సవ్యంగా సాగడం కోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ఛైర్మన్గా పర్యవేక్షక కమిటీ (ఎస్సీ)ని సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే.

పర్యవేక్షక కమిటీలో బేధాభిప్రాయాలు..
అందులో ఐపీఎస్ అంజనీ కుమార్, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, వంకా ప్రతాప్ ఇతర సభ్యులుగా ఉన్నారు. కానీ ఈ ఎస్సీ సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదన్న విషయం ఇప్పటికే జస్టిస్ కక్రూ నివేదికతో స్పష్టమైంది. ఛైర్మన్గా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్రంలో 33 జిల్లా సంఘాలకు హెచ్సీఏ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు ఎస్సీ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
అంతే కాకుండా పదవీ కాలం ముగిసినందున అజారుద్దీన్ అధ్యక్షతన హెచ్సీఏలో తీసుకున్న నిర్ణయాలను పక్కన పెడుతున్నట్లూ పేర్కొన్నారు. సెప్టెంబర్ తర్వాత అతను కానీ, అతను నియమించిన సెలక్టర్లు కానీ లేదా అతని ఆధ్వర్యంలో కానీ జరిగిన సెలక్షన్స్ చెల్లవని ఆయన చెప్పారు.

కివీస్తో వన్డేపై నీలినీడలు..
సెలక్టర్లు, కోచ్ల ఎంపిక కూడా నిబంధనలకు విరుద్ధమన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇంతలోనే రంజీ ట్రోఫీ కోసం 21 మంది ఆటగాళ్లతో జట్టును హెచ్సీఏ ప్రకటించింది. మరి ఈ ఎంపిక ఎస్సీ ఆధ్వర్యంలోనే జరిగిందా? అనే దానికి సమాధానం లేదు. హెచ్సీఏ ఎన్నికలపై ఈ కమిటీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వచ్చే నెల 18న కివీస్తో వన్డేకు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్కు దక్కింది. కానీ హెచ్సీఏలో గొడవల వల్ల మ్యాచ్ నిర్వహణ సందిగ్ధంలో పడేలా ఉంది.

ఒక్కో ప్లేయర్ నుంచి రూ.15 లక్షలు...
సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయంలో జరిగిన గొడవ తెలిసిందే. మరోవైపు హెచ్సీఏ తరపున అక్రమదారుల్లో ఆటగాళ్లను ఆడించడం కోసం ఒక్కో మ్యాచ్కు రూ.15 లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిభావంతులైన క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హెచ్సీఏలో అంతర్గత కుమ్ములాటలు, వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications