టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. అందుబాటులో ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నయా రూల్ తీసుకురావడంతో ఇప్పటికే స్టార్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీలోకి రీఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, శుభమన్ గిల్ రంజీ ట్రోఫీలోకి రీఎంట్రీ ఇచ్చారు. మెడ నొప్పి కారణంగా కోహ్లీ రీఎంట్రీ ఆలస్యమైంది. ప్రస్తుతం కోలుకున్న కోహ్లీ.. ఢిల్లీ తరఫున రైల్వేస్తో గురువారం నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లో అతను బరిలోకి దిగనున్నాడు.

ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించగా.. ఆ టీమ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇప్పటికే కోహ్లీ.. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ముంబైలోని అలీబాగ్లో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. స్క్వేర్ ఆఫ్ ది వికెట్ షాట్లను బాదడంతో పాటు బ్యాక్ఫుట్పై ఆడడంపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీల బలహీనతను అధిగమించడంపై బంగర్తో కలిసి వర్క్ చేశాడు.
ఢిల్లీ జట్టుతో కలిసి కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. కుర్రాళ్లతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడాడు. 13 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు జియో సినిమా సిద్దమైంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తామని ప్రకటించింది. జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియో సినిమాలో ఉచితంగా ఈ మ్యాచ్ చూడవచ్చు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ను ఉచితంగా చూసే అవకాశాన్ని డీడీసీఏ ప్రేక్షకులకు కల్పించింది. ఎలాంటి టికెట్లు లేకుండానే ఈ మ్యాచ్ను ఫ్రీగా చూడవచ్చు.
ఢిల్లీ జట్టు: ఆయుష్ బదోని(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ప్రణవ్(కీపర్), సనత్ సంగ్వాన్, అప్రిత్ రాణా, మయాంక్ గుసైన్, శివమ్ శర్మ, సుమిత్ మతుర్, వాన్ష్ బేడీ(కీపర్), మనీ గ్రేవల్, హర్ష్ త్యాగీ, సిద్దాంత్ శర్మ, నవ్దీప్ సైనీ, యశ్ ధుల్, గగన్ వాత్స్, జాంటీ సిధు, హిమ్మత్ సింగ్, వైభవ్ కండపాల్, రాహుల్ గెహ్లోత్, జితేశ్ సింగ్.