పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్దమయ్యాడు. అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ(బీసీసీఐ) కొత్త రూల్ తీసుకురావడంతో స్టార్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యారు.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్లు రంజీ ట్రోఫీ బరిలో నిలిచారు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించే రోహిత్ శర్మ.. జమ్ముకశ్మీర్తో గురువారం నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ చెలరేగుతాడని, అతను పరుగుల ఆకలితో ఉన్నాడని ముంబై సారథి అజింక్యా రహానే ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్కు విపరీతమైన క్రేజ్
రోహిత్ శర్మ రాకతో ఈ రంజీ మ్యాచ్కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పటి నిర్వాహకులు ఈ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మ్యాచ్ జరిగే బీకేసీ గ్రౌండ్లో అదనపు కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఆటను చూసేందుకు స్థానికి అభిమానులు పోటెత్తనున్నారు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
రంజీ ట్రోఫీ 2024-25కి జియో సినిమా, స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. జమ్ము కశ్మీర్- ముంబై రంజీ మ్యాచ్ను జియో సినిమాలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. స్పోర్ట్స్ 18లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. 9 గంటలకే టాస్ వేయనున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.