
హైదరాబాద్: సచిన్ కళాత్మక కవర్ డ్రైవ్లు... యువరాజ్ సింగ్ ధనాధన్ సిక్స్లు.. పఠాన్ సూపర్ స్వింగర్లు.. వాయువేగంతో దూసుకెళ్లే మునాఫ్ పటేల్,హర్భజన్ సింగ్ బంతులు.. పక్షిలా ఎగిరి బంతిని అందుకునే సురేశ్ రైనా ఫీల్డింగ్ మెరుపులు.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు..! అభిమానుల మదిలో చెరగని ముద్రవేసిన ఇలాంటి అపురూప దృశ్యాలు మరోసారి కళ్ల ముందు సాక్షాత్కారం కానున్నాయి..! క్రికెట్కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు...!
వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అననున్నారు..! తమ ఆటతో క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. మరోసారి పొట్టి ఫార్మాట్లో పోటీ పడనున్నారు..! రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ సీజన్ ఘనంగా ముగించుకున్న ఈ టోర్నీ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది.
ఈ సిరీస్ రెండో సీజన్లో ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దిగ్గజ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ చేరడంతో మొత్తం జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
నేటి( సెప్టెంబర్ 10) నుంచి అక్టోబర్ 1 వరకు రెండో సీజన్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లు కాన్పూర్, రాయ్పూర్, ఇండోర్తో పాటు డెహ్రాడూన్ వేదికగా జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్కు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. రాయ్పూర్ వేదికగా సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మరోవైపు లెజెండ్స్ లీగ్ క్రికెట్ కూడా సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లన్నీ కలర్స్ సినీప్లెక్స్, స్పోర్ట్స్ 18 ఖేల్ చానెల్స్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతేకాకుండా వూట్ యాప్, వెబ్సైట్లో కూడా మ్యాచ్లను చూడవచ్చు. అయితే ఈ ఫ్లాట్ ఫామ్స్లో మ్యాచ్ చూడాలంటే రుసుము చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా మ్యాచ్లను చూడవచ్చు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య కాన్పూర్ వేదికగా జరగనుంది.