ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో శుభారంభం అందుకోలేకపోయిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. తొలి టెస్ట్ పరాజయం నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. ఇప్పటికే విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నాహకాలు పూర్తి చేసుకుంది. జట్టులో చేయాల్సిన వ్యూహాత్మక మార్పులపై ఫోకస్ పెట్టింది.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. తొలి టెస్ట్ ఆడని నితీష్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. శార్దూల్ ఠాకూర్పై వేటు వేయనున్నారు.

భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ బుధవారం (జూలై 2న) భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందుగానే టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్లను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ జియో హాట్స్టార్, సోనీ లివ్తో పాటు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్స్లో చూడవచ్చు. డీడీ స్పోర్ట్స్లో ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ఈ మ్యాచ్లను వీక్షించవచ్చు. సాధారణంగా విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్లను డీడీ స్పోర్ట్స్లో ప్రసారం చేయరు. కానీ ఈ సిరీస్ను ఫ్రీగా ప్రసారం చేయనున్నారు. జియో టీవీ యాప్లో సోనీ టెన్ 1 ఛానెల్ను సెలెక్ట్ చేసుకోని ఫ్రీగా ఈ మ్యాచ్ చూడవచ్చు.
తొలి టెస్ట్ తరహాలోనే ఇంగ్లండ్ తమ తుది జట్టును రెండు రోజుల ముందే ప్రకటించింది. తొలి టెస్ట్ ఆడిన జట్టునే రెండో టెస్ట్కు కొనసాగించింది. జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చినా అతనికి అవకాశం ఇవ్వలేదు.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రిస్ వోక్స్, జోష్ టోంగ్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్.
భారత్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా/ఆకాశ్ దీప్/అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.