భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్ట్ల సిరీస్కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. అయితే లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్ భారత కాలమానం ప్రకారం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ ఛానెల్లో మ్యాచ్లు వస్తాయి, ఫ్రీగా ఎలా చూడాలనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ హెడింగ్లీలోని లీడ్స్ మైదానం వేదికగా జరగనుంది. శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరగనుంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియా ఆడే తొలి సిరీస్ ఇదే.

భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందుగానే టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్లను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ జియో హాట్స్టార్, సోనీ లివ్తో పాటు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్స్లో చూడవచ్చు. డీడీ స్పోర్ట్స్లో ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ఈ మ్యాచ్లను వీక్షించవచ్చు. సాధారణంగా విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్లను డీడీ స్పోర్ట్స్లో ప్రసారం చేయరు. కానీ ఈ సిరీస్ను ఫ్రీగా ప్రసారం చేయనున్నారు.
ఈ మ్యాచ్కు బరిలోకి దిగే తుది జట్టును ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఇప్పటికే ప్రకటించింది. 11 మంది సభ్యుల వివరాలను వెల్లడించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత్ తమ తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. టాస్ సమయంలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రిస్ వోక్స్, జోష్ టోంగ్, బ్రైటన్ కార్స్, షోయబ్ బషీర్.
భారత్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రిసిధ్ కృష్ణ.