మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. 47 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ప్రపంచకప్ను ఎలాగైనా ఈసారి అందుకోవడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో గుహవాటి వేదికగా నేడు జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇంటా బయటా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత మహిళల జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ మాత్రం వెలతిగానే ఉంది. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్.. తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. కానీ ఈసారి సొంతగడ్డ అనుకూలతల్ని వినియోగించుకొని విజేతగా నిలవాలనే పట్టుదలతో హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఉంది. ఫామ్ ప్రకారం టైటిల్ ఫేవరేట్లలో భారత్ కూడా ఉందని చెప్పవచ్చు.

వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సూపర్ ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రతీక, హర్లీన్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. జెమీమా, హర్మన్ప్రీత్, దీప్తి శర్మలతో మిడిలార్డర్ కూడా పటిష్టంగానే ఉంది. రేణుక, క్రాంతి, అరుంధతిలతో కూడిన పేస్ దళానికి కొత్త స్పిన్ కెరటం, తెలుగు తేజం శ్రీచరణి జతయ్యింది. భారత్, శ్రీలంకతో పాటు మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.మొత్తం 5 వేదికల్లో ఈ టోర్నీ మ్యాచ్లు జరగనున్నాయి. భారత్లో విశాఖపట్నం, నవీ ముంబై, గువాహటి, ఇండోర్ స్టేడియాల్లో మ్యాచ్లు జరగనుండగా.. శ్రీలంకలో కొలంబో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతీ జట్టు లీగ్ దశలో ఏడు మ్యాచ్లు ఆడుతోంది. లీగ్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా.. నవంబర్ 2న ఫైనల్ జరగనుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్స్గా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్కు చెందిన హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం తదితర భాషల ఛాన్సెల్తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ చెల్లించాలంటే ఛానెల్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ హాట్స్టార్లో ఉచితంగా వీక్షించవచ్చు.
లీగ్ దశలో హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో సెప్టెంబర్ 30 తొలి మ్యాచ్, పాకిస్థాన్తో అక్టోబర్ 5న రెండో మ్యాచ్, సౌతాఫ్రికాతో అక్టోబర్ 9న వైజాగ్ వేదికగా మూడో మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న ఇంగ్లండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్తో భారత జట్టు తలపడనుంది.
భారత మహిళల జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్టిక భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్.