ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ ఈ టోర్నీకి హైబ్రిడ్ మోడల్లో ఆతిథ్యం ఇస్తుండగా.. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 19(బుధవారం) న్యూజిలాండ్తో జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ తలపడనుంది. మరుసటి రోజు బంగ్లాదేశ్తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దాయాదీ దేశాలు భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
8 ఏళ్ల తర్వాత..
దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిర్వహిస్తోంది. కరోనాతో పాటు ఐసీసీ మెగా టోర్నీల కారణంగా ఇన్నాళ్లు ఈ టోర్నీ నిర్వహించలేదు. 1998లో ఐసీసీ నాకౌట్ పేరిట ఈ టోర్నీని ప్రారంభించారు. క్రికెట్ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. 2002 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు.2006 వరకు ప్రతీ రెండేళ్లు ఒకసారి ఈ టోర్నీ జరగ్గా.. టీ20 ప్రపంచకప్ రాకతో ఆ తర్వాత మూడు, నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఎడిషన్లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ ఓడించి మరి టైటిల్ కైవసం చేసుకుంది.

ఓడితే ఇంటికే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్-8 టీమ్స్ పోటీపడుతాయి. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ కీలకమే. సెమీస్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. అందుకే దీన్ని నాకౌట్ టోర్నీగా భావిస్తారు. 8 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి మూడేసి మ్యాచ్లు ఆడుతాయి. ప్రతీ గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి. కాబట్టి నెట్ రన్రేట్ కూడా కీలకమే. ఘోర పరాజయం ఎదురైతే తర్వాతి మ్యాచ్ల్లో గెలిచినా ఫలితం ఉండదు. గ్రూప్-ఏ భారత్తో పాటు ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్లు ఉన్నాయి.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఐసీసీ టోర్నీలకు భారత్లో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్కు చెందిన 8 ఛానెల్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. జియోసినిమాతో భాగస్వామిగా మారిన విషయం తెలిసిందే. దాంతో రెండు ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికలు జియోస్టార్గా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జియోస్టార్ యాప్తో పాటు వెబ్సైట్లో చూడవచ్చు. గతంలో ఫ్రీగా మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా, హాట్ స్టార్.. ఇప్పుడు జియోస్టార్గా మారడంతో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రీగా చూసే వెసులుబాటు ఏ మాత్రం లేదు. సంబంధిత మొబైల్ నెట్వర్క్ రిచార్జ్ ప్లాన్స్తో జియోస్టార్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు.