ఆసియాకప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో మూడు రోజుల్లో ఈ మెగా ఆసియా టోర్నీకి తెరలేవనుంది. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం టీమిండియా ఏ టోర్నీ ఆడలేదు. బంగ్లాదేశ్ పర్యటన రద్దు కావడంతో భారత ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ మెగా టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు బుధవారమే యూఏఈకి చేరుకుంది. గురువారం ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొంది. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్ 9న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. దాయాదీ పాకిస్థాన్తో సెప్టెంబర్ 14న తలపడనుంది.

చివరిసారిగా ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్లో జరగ్గా.. భారత్ ఛాంపియన్గా నిలిచింది. 2016లో తొలి టీ20 ఫార్మాట్లో నిర్వహించగా.. అప్పుడు కూడా భారత్ విజేతగా నిలిచింది. కానీ 2022లో మరోసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించగా.. భారత్ కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఆ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలుస్తోంది. తాజా ఎడిషన్లో భారత్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నా.. టీ20 ఫార్మాట్లో ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం. ఓవరాల్గా 16 సార్లు జరిగిన ఆసియా కప్లో భారత్ 8 టైటిళ్లు గెలిచింది. భారత్తో పాటు పాకిస్థాన్, యూఏఈ, ఒమన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్, శ్రీలంకలు బరిలోకి దిగుతున్నాయి. ఒమన్ తొలిసారి ఆసియా కప్ ఆడనుండగా.. హాంగ్ కాంగ్(2018, 2022) రెండు సార్లు, యూఏఈ(2016) ఒక్కసారి ఆడింది.
ఆసియా కప్ 2025 టోర్నీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సోనీ నెట్వర్క్ దక్కించుకుంది. సోనీ టీవీ ఛానెల్స్తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లైవ్లోనూ ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే నేరుగా ఈ ఛానెల్స్, ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో చూడాలనుకుంటే రుసుము చెల్లించుకోవాలి. అయితే జియో యూజర్స్, ఎయిర్టెల్ యూజర్స్.. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీల సాయంతో ఈ మ్యాచ్లను ఉచితంగా చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా.. యూఏఈలోని ఉక్కపోత కారణంగా అర గంట పొడిగించారు.