ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది.
కామిందు మెండిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ చరిత్ అసలంక(20)తో పాటు కుశాల్ మెండీస్(0), డసన్ షనక(0), పాతుమ్ నిస్సంక(8) తీవ్రంగా నిరాశపర్చారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/28) మూడు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్(2/37), హుస్సేన్ తలత్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. అబ్రర్ అహ్మద్ ఒక వికెట్ తీసాడు.

అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి 12 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. హుస్సేన్ తలత్(30 బంతుల్లో 4 ఫోర్లతో 32 నాటౌట్), మహహ్మద్ నవాజ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ(2/24), వానిందు హసరంగా(2/27) రెండేసి వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా(1/31) ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ గెలుపుతో ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్ అవకాశాలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకోగా.. శ్రీలంక దాదాపు దూరం చేసుకుంది. అద్భుతం జరిగితే తప్పా శ్రీలంక ఫైనల్ చేరే అవకాశాలు లేవు. తాజా మ్యాచ్ ఫలితం తర్వాత సూపర్-4 టేబుల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. శ్రీలంక రన్ రేట్ కూడా నెగటీవ్గా మారింది. శ్రీలంక ఫైనల్ చేరాలంటే.. బంగ్లాదేశ్ తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్, పాకిస్థాన్ను ఓడించాలి.
అదే సమయంలో శ్రీలంక.. భారత్పై భారీ విజయాన్ని నమోదు చేయాలి. అప్పుడు మూడు మ్యాచ్లకు మూడు గెలిచిన బంగ్లాదేశ్ టాప్ ప్లేస్తో ఫైనల్ చేరనుండగా.. ఒక్కో మ్యాచ్ గెలిచిన భారత్, శ్రీలంక, పాకిస్థాన్లో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు టైటిల్ ఫైట్కు అర్హత సాధిస్తోంది. భారత్ను భారీ తేడాతో ఓడిస్తే శ్రీలంక రన్రేట్ మెరుగవుతుంది. అయితే ఇది జరగడం అసాధ్యం.