వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో సౌతాఫ్రికా 63.33 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా(58.89), భారత్(55.88)తో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్కు సౌతాఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే సఫారీ టీమ్ అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతోంది.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆ జట్టుకు ఇంకా రెండే మ్యాచ్లు ఉన్నాయి. పాకిస్థాన్తో సొంతగడ్డపై రెండు టెస్ట్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ గెలిచినా సౌతాఫ్రికా ఫైనల్ చేరుతోంది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లో పాకిస్థాన్ను సౌతాఫ్రికా ఓడిస్తే మాత్రం ఆ జట్టు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది.

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్.. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా పాకిస్థాన్ చరిత్రకెక్కింది. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో.. టెస్ట్ సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా రెండు మ్యాచ్లు ఓడితే ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ 52.78కి పడిపోతుంది. అప్పుడు ఫైనల్ చేరేందుకు భారత్కు మార్గం సుగమమవుతోంది.
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగియగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్ట్ డ్రా అయ్యింది. చివరి రెండు టెస్ట్లను భారత్ గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటే భారత్ ఫైనల్ బెర్త్ ఖాయం అవుతోంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా.. రెండింటిలో, డ్రా చేసుకున్నా ఫైనల్ బెర్త్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.
ఒకవేళ సౌతాఫ్రికా చివరి రెండు టెస్ట్ల్లో ఓడితే భారత్.. తమ చివరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ఫైనల్ బెర్త్ దక్కుతోంది. మరోవైపు ఆసీస్.. శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ల సిరీస్ను గెలిస్తే ఫైనల్ చేరుతోంది. లేదంటే భారత్తో ఒకటి, శ్రీలంకతో ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాను టెస్ట్ల్లో కూడా పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.