వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)స్వరూపంలో భారత ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు కేవలం 5 శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానాన్ని మాత్రమే కొనసాగించనుంది. గతంలో ఉన్న 12, 28 శాతం శ్లాబులను రద్దు చేసింది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం పన్నును వసూలు చేయనున్నారు. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ప్రజలపై పన్నుల భారం తగ్గించినా.. క్రికెట్ అభిమానులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తాజా జీఎస్టీ శ్లాబుల ప్రకారం ఐపీఎల్ లగ్జరీ పన్నుల శ్లాబులోకి రానుంది. ఈ లెక్కన ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన మ్యాచ్ టికెట్లపై 40 శాతం పన్నును వసూలు చేయనున్నారు.

40 శాతం జీఎస్టీ కారణంగా ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల రేట్లు భారీగా పెరగనున్నాయి. గతంలో ఐపీఎల్ టికెట్లపై 28 శాతం జీఎస్టీని మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు 40 శాతానికి పెరగడంతో టికెట్ల రేట్లు రెట్టింపు అవ్వనున్నాయి. ఐపీఎల్ ప్రారంభ టికెట్ ధర 28 శాతం జీఎస్టీతో కలుపుకొని 960గా ఉండగా.. తాజా 40 శాతం పన్నుతో ఆ ధర రూ. 1050కి పెరగనుంది. ఆర్సీబీ, సీఎస్కే, కేకేఆర్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మ్యాచ్లకు ఈ ధరలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. క్రేజ్ ఉన్న మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను ఫ్రాంచైజీలు అధిక ధరకు అమ్ముకుంటాయి. ఆ లెక్కన ఆ మ్యాచ్ల టికెట్ల ధరలు మరింత పెరగనున్నాయి. కుటుంబంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లాలంటే సగం జీతం సమర్పించుకోవాల్సిందే.
స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించడాన్ని ఒక విలాసవంతమైన కార్యకలాపంగా కేంద్ర ప్రభుత్వం పరిగణించింది. అందుకే దీన్ని లగ్జరీ గూడ్స్ కేటగిరీలోకి చేర్చింది. ఇది పొగాకు ఉత్పత్తులు, బెట్టింగ్ కార్యకలాపాలతో సమాన కేటగిరీలో వస్తుంది. నాన్ ఐపీఎల్ అంటే బీసీసీఐ, ఐసీసీ నిర్వహించే సాధారణ క్రికెట్ మ్యాచ్లకు ఇది వర్తించదు. అవి ఇప్పటికీ 18 శాతం జీఎస్టీ పరిధిలోనే కొనసాగుతున్నాయి.
ఈ 40 శాతం జీఎస్టీని రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భరించాలని క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఐపీఎల్కు సామాన్యులు దూరమవుతారని హెచ్చరిస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే.. భారత క్రికెట్ మ్యాచ్లకు మాత్రం పన్నును 18 శాతాన్నే వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్ల ధరల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఐపీఎల్తో పాటు ప్రజాదరణ పొందిన ఇతర ఈవెంట్స్కు కూడా 40 శాతం పన్నును వసూలు చేయనున్నారు. ఏ ఈవెంట్లో అయినా రూ. 500 లోపు టికెట్లకు మాత్రం పన్నును వసూలు చేయరు.