ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ.. మెరుగైన రన్రేట్ లేని కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-8 పోరులో శ్రీలంకను 147 పరుగులకు కట్టడి చేయలేక రన్రేట్(-0.123)లో వెనుకబడిన పాకిస్థాన్ ఇంటిముఖం పట్టింది. పాకిస్థాన్ మాదిరే 3 మ్యాచ్ల్లో 3 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్రేట్తో న్యూజిలాండ్(1.390) సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100), ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 84) విధ్వసంకర బ్యాటింగ్తో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓ దశలో శ్రీలంక 147 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ డసన్ షనకతో(76 నాటౌట్) పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. షాహీన్ అఫ్రిది వేసిన ఆఖరి ఓవర్లో షనక.. 4, 6, 6, 6 బాది గెలిపించినంత పనిచేశాడు. కానీ ఆఖరి బంతిని షాహీన్ అఫ్రిది వైడ్ యార్కర్గా సంధించగా.. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. రూల్స్ ప్రకారం ఈ బంతి వైడ్. దాంతో శ్రీలంక ఓటమిపాలైంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి తప్పుకున్నా పాకిస్థాన్కు ప్రైజ్మనీ దక్కనుంది. పాకిస్థాన్తో పాటు ఈ టోర్నీ ఆడిన 20 జట్లకు ప్రైజ్మనీ దక్కుతుంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సంబంధించిన ప్రైజ్మనీ వివరాలను ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ గత ఎడిషన్ కంటే ఈ సారి ప్రైజ్మనీ 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఎడిషన్ ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఒక్కో జట్టుకు సుమారు ₹6.5 కోట్లు లభించాయి. ఈ సారి రూ.7.2 కోట్ల దక్కే ఛాన్స్ ఉంది. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.2- 2.3 కోట్ల దక్కనుంది. సూపర్-8 చేరిన జట్లకు వారి స్థానాలను బట్టి రూ.3.1 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల దక్కనుంది. సెమీఫైనల్, ఫైనల్ మినహాయించి గ్రూప్ దశలో సాధించిన ప్రతీ విజయానికి గానూ ఒక్కో జట్టుకు సుమారు రూ.25-30 లక్షల చొప్పున ఐసీసీ అదనంగా అందజేయనుంది. విజేతగా నిలిచే జట్టుకు రూ.25 కోట్లు నుంచి రూ.27 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుండగా.. రన్నరప్కు రూ.13.3 కోట్ల నుంచి రూ.14.6 కోట్ల దక్కనుంది.
ఈ లెక్కన పాకిస్థాన్కు రూ.3.1 కోట్ల నుంచి రూ.3.5 కోట్లతో పాటు లీగ్ దశ, సూపర్ -దశల్లో సాధించిన ప్రతీ విజయానికి అదనంగా ఒక కోటీ 13 లక్షలు 50 వేలు లభించనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ లీగ్ దశలో మూడు విజయాలు సాధించగా.. సూపర్-8లో ఒక విజయంతో పాటు మరో మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.