ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ప్రస్థానం ఒక్క విజయం లేకుండానే ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్ తీవ్రంగా నిరాశపర్చింది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్.. సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. బంగ్లాదేశ్తో గురువారం జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా బంతిపడకుండా రద్దయ్యింది.
ఉదయం నుంచే వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్లో మొత్తం నీళ్లు చేరడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో ఒక్క విజయం కూడా సాధించకుండానే పాకిస్థాన్ పోరాటం ముగిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా నిష్క్రమించిన జట్టుగా పాకిస్థాన్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. ఆస్ట్రేలియా తర్వాత లీగ్ దశలో వెనుదిరిగిన డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్థాన్ జట్టే.

ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టుకు రూ. 2.31 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లకు కనీసం రూ. 1.9 కోట్లు దక్కనున్నాయి. 7, 8వ స్థానాల్లో నిలిచే జట్లకు అదనంగా రూ. 1.22 కోట్లు దక్కుతాయి. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం సాధిస్తే బంగ్లాదేశ్కు కూడా రూ. 2.31 కోట్ల ప్రైజ్మనీ దక్కుతుంది. సౌతాఫ్రికా చేతిలో కూడా ఇంగ్లండ్ ఓడితే బంగ్లాదేశ్ ఆరో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు ఆ జట్టుకు రూ. 4.28 కోట్లు దక్కుతాయి. ఐదు, ఆరో స్థానాల్లో నిలిచి జట్లకు కనీస ప్రైజ్మనీ రూ. 1.9 కోట్లకు అదనంగా రూ. 3.05 కోట్లు దక్కుతాయి. టైటిల్ గెలిచే జట్టుకు రూ. 19.56 కోట్లు ఇవ్వనున్నారు. రన్నరప్ టీమ్కు రూ. 9.78 కోట్లు, సెమీఫైనలిస్ట్లకు రూ. 4.89 కోట్లు దక్కుతాయి.